Kadapa District: మతి స్థిమితం లేని యువతిపై గ్యాంగ్ రేప్.. కేసు నమోదుకు నిరాకరిస్తున్న పోలీసులు!

  • కడప జిల్లా రైల్వేకోడూరులో దారుణం
  • గర్భం దాల్చిన బాధితురాలు
  • పోలీసులను ఆశ్రయించిన కుటుంబసభ్యులు

ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో మృగాళ్లు రెచ్చిపోయారు. మతిస్థిమితం లేని యువతిపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. దీంతో సదరు యువతి గర్భం దాల్చింది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, కేసు నమోదు చేసేందుకు పోలీస్ అధికారులు నిరాకరించారు. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

జిల్లాలోని రైల్వేకోడూరు మండలం, శాంతినగర్ లో మతి స్థిమితం లేని యువతి తన తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. ఈ నేపథ్యంలో యువతిపై కన్నేసిన ముగ్గురు దుండగులు తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఆమెకు మాయమాటలు చెప్పి, గత కొంతకాలంగా లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో యువతి గర్భం దాల్చింది.

ఈ విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు నిందితులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించారు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసేందుకు అధికారులు నిరాకరించారు. దీంతో తమకు పోలీసుల దగ్గర కూడా న్యాయం జరగలేదనీ, తాము ఇంకెవరి దగ్గరకు వెళ్లాలని బాధితురాలి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

More Telugu News