Telangana: హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదం.. లారీ ఢీకొని టీఆర్ఎస్ నేత కుమార్తె దుర్మరణం!

  • మేడిపల్లిలోని బోడుప్పల్ వద్ద ఘటన
  • ప్రమాదం అనంతరం పరారైన లారీ డ్రైవర్
  • కేసు నమోదుచేసిన పోలీసులు

హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. డీఆర్డీవో ప్రవేశపరీక్ష రాసి స్కూటిపై వెళుతున్న ఓ యువతిని లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో అధికార టీఆర్ఎస్ నేత కుమార్తె ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నగరంలోని బోడుప్పల్ కమాన్ దగ్గర చోటుచేసుకుంది.

పెద్దపల్లి జల్లా రత్నపూర్ కు చెందిన టీఆర్ఎస్ నేత ముక్కెర సతీశ్ కుమార్ కుమార్తె ముక్కెర అక్షిత బీటెక్ పూర్తిచేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ఈరోజు జరిగిన డీఆర్డీవో ప్రవేశపరీక్షకు హాజరయింది. అనంతరం హైదరాబాద్ లోని బంధువుల ఇంటికి స్కూటిపై తిరిగివెళుతుండగా మేడిపల్లి పరిధిలోని బోడుప్పల్ కమాన్ వద్ద వెనుక నుంచి వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది.

దీంతో రోడ్డుపై అంతెత్తున ఎగిరిపడ్డ అక్షిత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ప్రమాదం అనంతరం లారీ డ్రైవర్ ఘటనాస్థలం నుంచి పరారయ్యాడు. కాగా, కుమార్తె మరణంతో ముక్కెర సతీశ్ కుటుంబీకులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News