ఫోన్ కోసం అక్కాచెల్లెళ్ల గొడవ.. తల్లిదండ్రులు మందలించడంతో రైలు కిందపడి అక్క ఆత్మహత్య

సెల్‌ఫోన్ కోసం అక్కాచెల్లెళ్ల మధ్య జరిగిన గొడవ అక్క ఆత్మహత్యకు కారణమైంది. మంచిర్యాలలో జరిగిందీ ఘటన.  పోలీసుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన కంభం దామోదర్ రెడ్డికి ఇద్దరు కుమార్తెలు సుచిత, హాసిని ఉన్నారు. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న సుచిత శనివారం రాత్రి చెల్లెలు హాసినితో కలిసి సెల్‌ఫోన్ చూస్తుండగా ఫోన్ తనకు ఇవ్వాలంటూ హాసిని గొడవ పడింది. గమనించిన తండ్రి దామోదర్ వారిని మందలించాడు.

పరీక్షలు దగ్గరపడుతుండడంతో చదువుపై దృష్టిపెట్టాలంటూ మండిపడ్డారు. దీంతో మనస్తాపం చెందిన సుచిత రాత్రి పది గంటల సమయంలో ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో కంగారుపడిన తల్లిదండ్రులు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకుండా పోయింది. ఆదివారం ఫ్లైఓవర్ సమీపంలో రైలు పట్టాల పక్కన సుచిత మృతదేహం కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Telangana
Mancherial District
Cell phone
Suicide

More Telugu News