Kesineni Nani: తెరపైకి మరో ఆంధ్ర ఆక్టోపస్.. ఆయన చెప్పిందే తెలంగాణ ఎన్నికల్లో జరిగింది!

  • టీఆర్ఎస్ కు 75 నుంచి 80 సీట్లు వస్తాయని చెప్పిన కేశినేని నాని
  • కౌంటింగ్ కు ఒక రోజు ముందు టీడీపీ ఎంపీలకు చెప్పిన వైనం
  • ఇదే విషయాన్ని విజయవాడలో చాలా మందికి చెప్పిన నాని

ఎన్నో ఎన్నికల ఫలితాలను సరిగ్గా అంచనా వేసి, వెల్లడించిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఆంధ్ర ఆక్టోపస్ గా పేరుగాంచిన సంగతి తెలిసిందే. అయితే, తెలంగాణ ఎన్నికల ఫలితాలను అంచనా వేయడంలో మాత్రం ఆయన బొక్కబోర్లా పడ్డారు. తద్వారా ఎన్నో విమర్శలను మూటగట్టుకుంటున్నారు. తాజాగా, మరో ఆంధ్ర ఆక్టోపస్ పేరు తెరపైకి వచ్చింది. తెలంగాణకు సంబంధించి ఆయన వెల్లడించిన అంచనాలే నిజమయ్యాయి. ఆయన మరెవరో కాదు... విజయవాడ టీడీపీ ఎంపీ కేశానేని నాని.

టీఆర్ఎస్ కు 75 నుంచి 80 సీట్లు వస్తాయని కేశినేని నాని చెప్పిందే... చివరకు నిజమైంది. తెలంగాణ కౌంటింగ్ కు ఒక రోజు ముందు (10వ తేదీ) ఢిల్లీలోని ఏపీ భవన్ లో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. రాహుల్ తో భేటీ నేపథ్యంలో, ఈ సమావేశానికి చంద్రబాబు కొంచెం ఆలస్యంగా వచ్చారు.

ఈ సందర్భంగా టీడీపీ ఎంపీలు పిచ్చాపాటిగా మాట్లాడుకున్నారు. తెలంగాణ ఫలితాలు ప్రజాకూటమికే అనుకూలంగా రాబోతున్నాయని ఎంపీలంతా అభిప్రాయపడ్డారు. అయితే, కేశినేని కల్పించుకుని, తెలంగాణలో వాస్తవ పరిస్థితి అది కాదని... టీఆర్ఎస్ కు 75 నుంచి 80 స్థానాలు వస్తాయని చెప్పారు. నాని మాటలకు ఎంపీలంతా షాక్ అయ్యారు. టీఆర్ఎస్ గెలవబోతోందని విజయవాడలో కూడా చాలా మందితో నాని చెప్పారట. అయితే, ఆయన మాటలను ఎవరూ పట్టించుకోలేదు. చివరకు, ఆయన చెప్పిన జోస్యమే నిజమైంది. 

More Telugu News