train: రైల్లో పెళ్లికుమార్తె... అర్ధరాత్రి మంచినీళ్లకని దిగితే..!

  • గత వారంలో ఓ జంటకు వివాహం
  • రిసెప్షన్ ఇచ్చేందుకు రైలులో ఢిల్లీకి పయనం
  • పెళ్లి కుమార్తె మాయం కావడంతో బంధువుల్లో ఆందోళన
  • అత్తారింటికి చేరుకుందని తెలిసి ఊపిరిపీల్చుకున్న వైనం 

పెళ్లయిన ఓ జంట ఢిల్లీలో రిసెప్షన్ ఇచ్చేందుకు రైలులో వెళుతున్న వేళ, అర్ధరాత్రి పెళ్లి కుమార్తె మాయం కావడం, ఆమె ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో హడలిపోయిన బంధువర్గం చివరకు ఆమె క్షేమమేనని తెలుసుకుని ఊపిరి పీల్చుకుంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే, గత వారంలో యూపీలోని ఆజాంగఢ్ లో ఓ జంటకు పెళ్లి కాగా, బంధుగణంతో కలిసి వారు కైఫియాత్ ఎక్స్‌ప్రెస్‌ లో ఢిల్లీ బయలుదేరారు.

పెళ్లి కుమార్తె, ఆమె కజిన్ ఏసీ బోగీలోను, మిగతావారు స్లీపర్ క్లాస్ లోను ప్రయాణిస్తున్నారు. రైలు అలీగఢ్ సమీపానికి చేరుకునే సరికి పెళ్లి కుమార్తె కనిపించలేదు. వాష్ రూములో ఆమె లేకపోవడం, సెల్ ఫోన్ స్విచ్ఛాప్ రావడంతో, బంధువులు ఆందోళన చెంది, రైలు దిగి వెళ్లి జీఆర్పీ ఫోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, తెల్లారేసరికి వారికి అసలు విషయం తెలిసింది. పెళ్లి కుమార్తె మంచినీళ్ల కోసమని దిగగా, రైలు వెళ్లిపోయింది. ఆ వెనుక వచ్చిన మరో రైలును పట్టుకుని ఢిల్లీలోని తన అత్తవారింటికి ఆమె చేరుకుంది. మొబైల్ ఫోన్ లో బ్యాటరీ చార్జింగ్ అయిపోవడంతోనే ఇంత జరిగిందట.

More Telugu News