కశ్మీర్ లో చొరబడ్డ ముగ్గురు పాక్ ఉగ్రవాదులు.. చుట్టుముట్టి కాల్చిచంపిన సైన్యం!

  • జమ్మూకశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో ఘటన
  • నిఘా వర్గాల సమాచారంతో బలగాల ఆపరేషన్
  • కాల్పుల్లో ఇద్దరు జవాన్లకు గాయాలు
జమ్మూకశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఈరోజు భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్ కౌంటర్ లో భద్రతాబలగాలు ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి. ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. పాకిస్తాన్ నుంచి కొందరు ఉగ్రవాదులు పుల్వామాలోకి చొరబడినట్లు నిఘా వర్గాల నుంచి పక్కా సమాచారం అందిందని తెలిపారు.

వెంటనే అప్రమత్తమైన బలగాలు రంగంలోకి దిగి ఉగ్రవాదులు నక్కిన ఇంటిని చుట్టుముట్టాయని చెప్పారు. భద్రతాబలగాల కదలికలను పసిగట్టిన ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూ పరారయ్యేందుకు యత్నించారని వెల్లడించారు. దీంతో బలగాలు ఎదురుకాల్పులు జరిపాయనీ, ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయారని పేర్కొన్నారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు జవాన్లకు గాయాలు అయ్యాయనీ, క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించామని తెలిపారు.

ఉగ్రవాదుల వివరాలు ఇంకా తెలియరాలేదన్నారు. ఘటనాస్థలం నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రితో పాటు నిషేధిత సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.
Go Back to Shorts
Jammu And Kashmir
encounter
terrorists dead
army
security forces

More Telugu News