Telangana: టీఆర్ఎస్ సీనియర్ నేత రాములు కన్నుమూత!

  • శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్న రాములు
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
  • కుటుంబాన్ని పరామర్శించిన తుమ్మల

తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) సీనియర్ నేత బత్తుల రాములు (71) కన్నుమూశారు. గత కొంతకాలంగా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో నిన్న రాత్రి హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడే చికిత్స పొందుతూ రాములు ప్రాణాలు కోల్పోయారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం జగన్నాధపురం ఆయన స్వస్థలం. ఆయనకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు.

పార్టీ స్థాపించినప్పటి నుంచి బత్తుల రాములు టీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నారు. తిరుమలాయపాలెం మండల పరిధిలోని గ్రామాల్లో టీఆర్ఎస్ ను పటిష్టం చేసేందుకు ఆయన విశేషంగా కృషి చేశారు. కాగా, రాములు మృతిపై టీఆర్ఎస్ సహా పలు పార్టీల నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తుమ్మల నాగేశ్వరరావు తనయుడు తుమ్మల యుగంధర్‌, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మద్దినేని బేబి స్వర్ణకుమారి తదితరులు రాములు భౌతికకాయానికి నివాళులు అర్పించారు. మరోవైపు బత్తుల రాములు కుటుంబాన్ని మాజీ మంత్రి తుమ్మల ఫోన్ లో పరామర్శించారు. అధైర్య పడొద్దనీ, పార్టీ అండగా ఉంటుందని రాములు కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.

More Telugu News