MRI Scaning: ఎమ్మారై స్కానింగ్‌కు వెళితే.. షాకిచ్చారు!

  • కాలి నొప్పితో బాధపడుతున్న రైతు 
  • చికిత్స కోసం ముంబై ఆసుపత్రికి..
  • 2020కి అపాయింట్‌మెంట్ ఇచ్చిన సిబ్బంది

ఎమ్మారై స్కానింగ్ కోసం వెళ్లిన రైతుకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది ఆసుపత్రి సిబ్బంది. ముంబైలోని అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిందీ ఘటన. ఇంతకీ వాళ్లిచ్చిన షాక్ ఏంటో తెలుసా? ఎమ్మారై స్కానింగ్ కోసం 15 ఫిబ్రవరి 2020కి అపాయింట్‌మెంట్ ఇచ్చారు. కొంకణ్‌కు చెందిన అరుణ్ నార్(55) కొంత కాలంగా కాలి నొప్పితో బాధపడుతున్నాడు. చికిత్స కోసమని ముంబైలోని నాయర్ ప్రభుత్వాసుపత్రికి కొడుకుతో కలిసి వెళ్లాడు.

వైద్యులు పరిశీలించి ఎమ్మారై స్కానింగ్ తీయించుకుని రావాలని సూచించారు. దీంతో నార్ ఎమ్మారై విభాగానికి వెళ్లగా 15 ఫిబ్రవరి 2020కి అపాయింట్‌మెంట్‌తో కూడిన రసీదును చేతిలో పెట్టారు. అది చూసి ఏం చేయాలో పాలుపోక ఇంటికి తిరిగి వచ్చేసినట్టు నార్ కుమారుడు నీలేశ్ తెలిపాడు.

ఈ విషయమై ఆసుపత్రి సిబ్బంది మాట్లాడుతూ.. రోగులను దాదాపు 16 నెలల తరువాత రమ్మని చెప్పడం సిగ్గు చేటని.. కానీ గత్యంతరం లేదని తెలిపారు. ఎమ్మారై స్కానింగ్ కోసం తమకు రోజూ 50-60మంది రోగులను పంపిస్తున్తారని,అయితే, 12-15మందికి మాత్రమే స్కానింగ్ చేయగల సదుపాయం ఇక్కడ వుందని చెప్పారు.  

More Telugu News