West Godavari District: ఏపీలో కేసీఆర్ ప్లెక్సీ తొలగింపు.. వివాదం!

  • పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఏర్పాటు
  • అనుమతి లేదంటూ తొలగించిన అధికారులు
  • మిగతా ప్లెక్సీలు తొలగించకపోవడంతో వివాదం

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం బస్టాండ్‌ వద్ద కొందరు ఏర్పాటు చేసిన ప్లెక్సీ తొలగింపు వివాదాన్ని రేపింది. తెలంగాణ సీఎంగా రెండోసారి ఎన్నికైన కేసీఆర్‌ కు శుభాకాంక్షలు, 'తెలంగాణ బాహుబలికి శుభాకాంక్షలు' అంటూ, బుడితి అనిల్, మేడిది రాము, రెడ్డప్ప అనే వ్యక్తులు దీన్ని ఏర్పాటు చేశారు. అయితే, ఈ ప్లెక్సీని అనుమతి లేకుండా ఏర్పాటు చేశారంటూ, పోలీసులు, కొందరు మునిసిపల్‌ ఉద్యోగులు తొలగించారు.

పట్టణంలోని మిగతా ప్లెక్సీలను తొలగించకుండా, దీన్ని మాత్రమే తీసేయడంతో ప్లెక్సీని ఏర్పాటు చేసిన వారు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈ విషయంలో తమకు సంబంధం లేదని పోలీసులు, తమకు తెలియదని మునిసిపల్ అధికారులు చెబుతున్నారు. ప్లెక్సీ తొలగింపుపై రెడ్డప్ప మాట్లాడుతూ, గతంలో మాయావతి ఫ్లెక్సీలు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పెట్టారని, అప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడెందుకొచ్చిందని అడిగారు. మునిసిపాలిటీ అనుమతి తీసుకుని మళ్లీ ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తామన్నారు.

More Telugu News