Telugudesam: టీడీపీతో పొత్తు కొంపముంచుతుందని ముందే హెచ్చరించా: విజయశాంతి

  • పొత్తుతో గెలుస్తామనుకున్నారు
  • సొంత వ్యూహాన్ని కాంగ్రెస్ నేతలు పక్కన పెట్టారు
  • జరిగిన నష్టంపై అధిష్ఠానానికి ఓ నివేదిక సమర్పిస్తా

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ లు ప్రజాకూటమిగా ఏర్పడి బరిలోకి దిగి ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. మెదక్ జిల్లా నుంచి తనను కలిసేందుకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ఆమె మాట్లాడారు.

 టీడీపీతో పొత్తు కొంపముంచుతుందని తాను ముందే హెచ్చరించిన విషయాన్ని వారితో ఆమె ప్రస్తావించినట్టు సమాచారం. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే గెలుస్తామన్న ధీమాతో సొంత వ్యూహాన్ని కాంగ్రెస్ నేతలు పక్కన పెట్టడం వల్లే ఓటమి పాలయ్యామంటూ రాష్ట్ర నాయకత్వాన్ని తప్పుబట్టారు. పొత్తు కారణంగా జరిగిన నష్టంపై అధిష్ఠానానికి ఓ నివేదిక ఇస్తానని, సార్వత్రిక ఎన్నికల నాటికైనా కాంగ్రెస్ పార్టీ తప్పులను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని విజయశాంతి పేర్కొన్నారు. 

More Telugu News