kcr: కేసీఆర్ ఏ మొహం పెట్టుకుని ఏపీ రాజకీయాల్లో వేలు పెడతారు?: కిల్లి కృపారాణి

  • తెలంగాణలో టీడీపీ ఉంది కనుక మొన్న బరిలో ఉంది  
  • కేసీఆర్ కు దమ్ముంటే ఏపీలో ప్రచారం చేయాలి
  • కూటమి ఓటమికి అనేక కారణాలున్నాయి

ఏపీ రాజకీయాల్లోకి వస్తానంటూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, ఏపీ కాంగ్రెస్ నేత కిల్లి కృపారాణి కూడా స్పందిస్తూ, కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టీడీపీ ఉంది కనుక తాజాగా జరిగిన ఎన్నికల్లో బరిలో నిలిచిందని అన్నారు. మరి, కేసీఆర్ ఏ మొహం పెట్టుకుని ఏపీ రాజకీయాల్లో వేలు పెడతారని ప్రశ్నించారు.

కేసీఆర్ కు దమ్ముంటే 2019లో ఏపీలో జరగనున్న ఎన్నికల్లో ఓ రాజకీయ పార్టీ తరపున ప్రచారం చేయాలని సవాల్ విసిరారు. తెలంగాణలో ప్రజాకూటమి ఓటమిపైనా ఆమె స్పందించారు. కూటమి ఓటమికి అనేక కారణాలున్నాయని, సీట్ల సర్దుబాటు సహా అనేక విషయాల్లో తమకు సమయం సరిపోలేదని అన్నారు. తెలంగాణలో బీజేపీకి ఒక్క స్థానం రావడం సిగ్గుచేటని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

More Telugu News