Vijayawada: విజయవాడ లాయర్ ను పొడిచి.. పారిపోతూ యాక్సిడెంట్ లో ఇద్దరి మృతి!

  • విజయవాడలో పేరున్న న్యాయవాది బెనర్జీ
  • సివిల్ కేసు పరిష్కరించాలంటూ వచ్చిన ముగ్గురు
  • కత్తులతో పొడిచి పారిపోతుంటే యాక్సిడెంట్

విజయవాడలో పేరున్న న్యాయవాది బెనర్జీపై కత్తులతో దాడి చేసి విచక్షణారహితంగా పొడిచి పారిపోయిన వారి పాపం గంటలోనే పండింది. బెనర్జీపై దాడి చేసిన నిందితులు బైక్ పై పారిపోతూ, అదుపు తప్పి ఓ చెట్టుకు బలంగా ఢీకొనగా, ఇద్దరు మరణించారు. మరొకరు తీవ్రగాయాలతో చావు బతుకుల్లో ఉన్నాడు.

పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, నిందితులు ఓ సివిల్ కేసును పరిష్కరించాలంటూ బెనర్జీ వద్దకు వచ్చారు. తమ పని చేసి పెడితే, అడిగినంత డబ్బు ఇస్తామని చెప్పారు. దీనికాయన అంగీకరించి, తన కారులోనే ముగ్గురితో కలసి జీ కొండూరు మండలం హెచ్ ముత్యాలంపాడు గ్రామానికి బయలుదేరారు.

వారి మధ్య ఏం గొడవ జరిగిందో ఏమోగానీ, వారు ముగ్గురూ, లాయర్‌ పై కత్తులతో దాడికి దిగి ఇష్టానుసారం పొడిచారు. బెనర్జీ భయంతో కేకలు వేస్తుంటే, అరుపులు విన్న గ్రామస్తులు అక్కడికి పరుగున రాగా, నిందితులు కారులో నుంచి దిగి, అక్కడే వున్న ఓ బైక్ పై పారిపోయారు.

తమను ఎవరైనా వెంబడిస్తున్నారన్న భయంతో వేగంగా వెళుతుంటే, భీమవరం పాడు వద్ద బైక్ యాక్సిడెంట్ అయింది. ఒకరు అక్కడికక్కడే చనిపోగా, మరొకరు ఆసుపత్రికి తరలిస్తుంటే ప్రాణాలు కోల్పోయాడు. నిందితుల దాడిలో తీవ్రగాయాలైన బెనర్జీని స్థానికులు పోలీసుల సాయంతో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో, మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడలోని ఆంధ్రా ఆసుపత్రికి తరలించారు. కేసులో ప్రాణాలతో మిగిలిన మూడో నిందితుడిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

More Telugu News