Andhra Pradesh: జగన్ ను పులివెందులలో అడుగుపెట్టనివ్వం.. ఈ జన్మలో ఆయన సీఎం కాలేడు!: మంత్రి ఆదినారాయణ రెడ్డి

  • నన్ను పల్లెల్లోకి రానివ్వబోమని అంటున్నారు
  • జగన్ ను కడపకు రాకుండా ఆపే సత్తా మాకుంది
  • ఏపీలో ఇకపై పవర్ గేమ్ ఆడుతామని వ్యాఖ్య

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ ఈ జన్మలో ముఖ్యమంత్రి కాలేడని టీడీపీ నేత, మంత్రి ఆదినారాయణ రెడ్డి విమర్శించారు. కడప జిల్లాలోని పల్లెల్లో తనను అడ్డుకుంటామని వైసీపీ నేతలు ప్రగల్భాలు పలుకుతున్నారనీ.. అసలు జగన్ ను రాకుండా తామే అడ్డుకుంటామని స్పష్టం చేశారు. జగన్ ను పులివెందులలో అడుగుపెట్టనివ్వబోమని హెచ్చరించారు. ఆ సత్తా టీడీపీకి ఉందన్నారు. ఏపీలో గేమ్ స్టార్ట్ చేశామనీ, ఇక పవర్ గేమ్ ఆడుతామని వ్యాఖ్యానించారు. కడప జిల్లాలోని ఎర్రగుంట్లలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఆదినారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

‘తన తండ్రి వైఎస్ ఫొటోను ఓ పేపర్ లో రోజూ వేసుకునే జగన్.. ఆ పేపర్ తనది కాదని చెబుతాడు. భారతి సిమెంట్ తో తనకు సంబంధం లేదంటాడు. హైదరాబాద్, బెంగళూరులో ఉన్న ఖరీదైన ఇళ్లు తనవి కాదని చెబుతాడు. కేంద్ర దర్యాప్తు సంస్థలు పెట్టిన 12 కేసులతో తనకు సంబంధమే లేదంటాడు. కానీ మాపై తన ఛానల్, పేపర్ లో నిత్యం తప్పుడు వార్తలు రాయిస్తున్నారు. చివరికి పేదలకు కడుపు నింపే అన్న క్యాంటీన్లపై కూడా నీచ రాజకీయం చేస్తున్నారు’ అని ఆదినారాయణ రెడ్డి విమర్శించారు.

More Telugu News