Chittoor District: పీలేరు బస్టాండ్‌లో దారుణం.. యువకుడిని దారుణంగా నరికి చంపిన దుండగులు

  • కత్తులు, వేట కొడవళ్లతో దాడి
  • మృతుడు ఓ విద్యార్థిని హత్య కేసులో నిందితుడు
  • ప్రతీకార చర్యగా భావిస్తున్న పోలీసులు

చిత్తూరు జిల్లా పీలేరు బస్టాండ్‌లో ఆదివారం రాత్రి దారుణం జరిగింది. హరీశ్ (25) అనే యువకుడిని కొందరు యువకులు అత్యంత దారుణంగా నరికి చంపారు. మృతి చెందిన వ్యక్తిని స్థానిక లక్ష్మీపురం కాలనీకి చెందిన వెంకటరమణ-కళావతి దంపతుల కుమారుడు హరీశ్‌గా పోలీసులు గుర్తించారు.

హరీశ్ బస్టాండ్‌లో ఉన్న విషయం తెలుసుకున్న కొందరు దుండగులు కత్తులు, వేటకొడవళ్లతో అక్కడికి చేరుకుని అతనిపై దాడి చేశారు. విచక్షణా రహితంగా పొడిచి చంపారు. అతడు చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. రక్తపు మడుగులో పడి ఉన్న యువకుడిని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం హరీశ్ మృత దేహాన్ని ఆసుపత్రికి తరలించారు.

భాకరాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో జరిగిన ఓ విద్యార్థిని హత్య కేసులో హరీశ్ నిందితుడు. దీంతో ఇప్పుడీ హత్యను ప్రతీకార చర్యగానే పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News