Andhra Pradesh: ఆంధ్రాలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు భారీ పోటీ.. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సంఖ్య 3.38 లక్షలు!

  • ఒక్కో ఖాళీకి 142 మంది పోటీ
  • జనవరి 6న ప్రిలిమినరీ పరీక్ష
  • నిన్నటితో ముగిసిన దరఖాస్తు గడువు

పోలీస్ శాఖలో 2,723 ఖాళీల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కాగా, నిన్నటితో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ముగిసింది. ఈ విషయమై పోలీస్ శాఖ ఉన్నతాధికారి ఒకరు స్పందించారు.

ఏపీలో ఒక్కో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఈసారి ఏకంగా 142 మంది పోటీ పడుతున్నట్లు తెలిపారు. సివిల్‌, ఏఆర్‌, ఏపీఎస్పీ విభాగాల్లో కానిస్టేబుళ్లు, ఫైర్‌మెన్‌, జైలువార్డెన్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ జారీచేశామని వెల్లడించారు. నిన్న సాయంత్రం 5 గంటల నాటికి మొత్తం 3.38 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. ఈ పోస్టులకు వచ్చే ఏడాది జనవరి 6న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తామన్నారు.

భర్తీ చేయనున్న పోస్టులు ఇవే..
సివిల్ కానిస్టేబుల్ 1600
ఏఆర్ కానిస్టేబుల్ 300
ఏపీఎస్పీ కానిస్టేబుల్ 300
ఫైర్ మెన్ 400
జైలు వార్డెన్ 123

More Telugu News