woman: 23 ఎకరాల చెరువులో హెచ్ఐవీ మహిళ మృతదేహం.. మొత్తం నీటిని తోడేసిన గ్రామస్తులు!

  • కర్ణాటక హుబ్లి జిల్లా మొరాబ్ గ్రామంలో ఘటన
  • తాగునీటి కోసం చెరువు పైనే ఆధారపడ్డ గ్రామస్తులు
  • గ్రామస్తుల ఒత్తిడితో.. చెరువులోని నీటిని ఖాళీ చేసిన అధికారులు

కర్ణాటకలోని హుబ్లి జిల్లా మొరాబ్ గ్రామంలో 23 ఎకరాల చెరువులోని నీటినంతా తోడేశారు. వివరాల్లోకి వెళ్తే, నవంబర్ 29న ఆ చెరువులో హెచ్ఐవీ సోకిన ఓ మహిళ (27) మృతదేహం నీటిపై తేలియాడుతూ కనిపించింది. అప్పటికే ఆమె శరీరాన్ని చేపలు సగం తినేశాయి. ఈ మృత దేహాన్ని గమనించిన గ్రామస్తులు షాక్ కు గురయ్యారు. మంచినీటి కోసం ఆ గ్రామస్తులంతా ఆ చెరువుపైనే ఆధారపడి ఉన్నారు. దీంతో, ఆ నీటిని వినియోగించడానికి గ్రామస్తులు నిరాకరించారు. నీరు మొత్తం హెచ్ఐవీ వైరస్ తో కలుషితం అయిపోయిందనే భయాందోళనలతో వారు ఉన్నారు.

విషయం తెలుసుకున్న అధికారులు గ్రామానికి వచ్చి, ల్యాబ్ టెస్ట్ కోసం నీటిని పంపుతామని చెప్పారు. అయినా గ్రామస్తులు వినలేదు. నీటిలో హెచ్ఐవీ ఉందని, ఆ నీటిని తాము వినియోగించలేమని చెప్పారు. దాదాపు వెయ్యి మంది గ్రామస్తులు ఎనిమిది వాటర్ ట్యాంకులతో చెరువు వద్దకు చేరుకున్నారు. చెరువులోని నీటిని మీరు ఖాళీ చేయలేకపోతే... ఆ పని తామే చేస్తామని స్పష్టం చేశారు. దీంతో చేసేదేమీ లేక 4 మోటార్లు, 20 ట్యూబుల సాయంతో చెరువులోని నీటిని అధికారులు ఖాళీ చేసేశారు.

ఈ సందర్భంగా స్థానిక తహసీల్దార్ మాట్లాడుతూ, గ్రామస్తుల డిమాండ్ ను నెరవేర్చడం తప్ప తమకు మరో దారి లేకపోయిందని చెప్పారు. నిన్న సాయంత్రంతో చెరువు ఖాళీ అయిపోయిందని... చెరువును శుభ్రం చేసిన తర్వాత మాలాప్రభ కెనాల్ ద్వారా మళ్లీ నీటిని నింపుతామని తెలిపారు.

ఈ అంశంపై రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చెస్ట్ అండ్ కమ్యూనికబుల్ డిసీజెస్ డైరెక్టర్ డాక్టర్ నాగరాజ్ మాట్లాడుతూ, గ్రామస్తుల భయానికి ఎలాంటి శాస్త్రీయత లేదని చెప్పారు. హెచ్ఐవీతో నీరు మొత్తం కలుషితమైందని భావించడం సరికాదని అన్నారు. 25 డిగ్రీల సెంటిగ్రేడ్ కన్నా ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు... నీటిలో 8 గంటలకు మించి వైరస్ బతకలేదని ఆయన తెలిపారు.

More Telugu News