west bengal: బొగ్గు గనుల కుంభకోణం కేసు.. హెచ్సీ గుప్తాకు మూడేళ్ల జైలుశిక్ష!

  • బొగ్గు మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా పనిచేసిన హెచ్.సి. గుప్తా 
  • ఇదే కేసులో దోషులు క్రోఫా, సామ్రియాలకూ శిక్ష
  • ఈ ముగ్గురూ వెంటనే బెయిల్ పై విడుదల

పశ్చిమ బెంగాల్ లోని మోయిరా, మధుజోరే ప్రాంతాల్లోని బొగ్గు గనుల కుంభకోణానికి సంబంధించిన కేసులో నాటి బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి హెచ్.సి. గుప్తాకు మూడేళ్ల శిక్ష పడింది. ఈ మేరకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు నిచ్చింది. ఇదే కేసులో దోషులుగా తేలిన నాటి బొగ్గు శాఖ సంయుక్త కార్యదర్శి కేఎస్ క్రోఫా, ఆ శాఖ డైరెక్టర్ కేసీ సామ్రియాలకూ మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ ముగ్గురికి జైలు శిక్షతోపాటు రూ.50 వేల జరిమానా కూడా విధించింది.

అయితే, ఈ ముగ్గురికి శిక్ష పడిన వెంటనే వారికి బెయిల్ కూడా లభించింది. లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తుతో పాటు ఒకరి షూరిటీపై ఈ బెయిల్ ను కోర్టు మంజూరు చేసింది. జైలు శిక్ష విధించిన కాలం నాలుగేళ్ల కంటే తక్కువగా ఉండటంతోనే వీరికి ఈ బెయిల్ లభించినట్టు సమాచారం.

కాగా, ప్రైవేట్ సంస్థ వికాస్ మెటల్స్ అండ్ పవర్ లిమిటెడ్ ఎండీ వికాస్ పత్ని, ఆ సంస్థ ఆథరైజ్డ్ సిగ్నేచరి ఆనంద్ మల్లిక్ లకు కూడా నాలుగేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానాను సీబీఐ ప్రత్యేక కోర్టు విధించింది. వికాస్ మెటల్స్ సంస్థకు లక్ష రూపాయలు, వికాస్ పత్నికి రూ.25 లక్షలు, మల్లిక్ కు రూ.2 లక్షల చొప్పున ప్రత్యేక కోర్టు జరిమానా విధించింది.

More Telugu News