Modugula Venugopal Reddy: 'రానున్న ఎన్నికల్లో రెడ్ల రాజ్యం రావాలన్న' టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల.. టీడీపీలో కలకలం

  • టీడీపీలో నా పరిస్థితి ఘోరంగా ఉంది
  • గురజాలలో మనోడినే గెలిపించుకోవాలి
  • పేదల సంక్షేమం కోసమే వైయస్సార్ ముఖ్యమంత్రి అయ్యారు

గురజాల నియోజకవర్గం దాచేపల్లిలోని ఓ తోటలో ఒక సామాజిక వర్గం నిర్వహించిన వనభోజనాల కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో రెడ్ల రాజ్యం రావాలని అన్నారు. గురజాలలో మనోడినే గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.

టీడీపీలో తన పరిస్థితి దారుణంగా ఉందని చెప్పారు. రెడ్ల పరిస్థితి ఘోరంగా ఉందని అన్నారు. తన సామాజికవర్గ సోదరులు ఎవరు వచ్చినా సాయం చేస్తానని చెప్పారు. రెడ్ల కోసం వైయస్సార్ ముఖ్యమంత్రి కాలేదని... పేదల సంక్షేమం కోసమే సీఎం అయ్యారని అన్నారు. ఆరోగ్యశ్రీలాంటి కార్యక్రమాలు ఆయన చలవేనని చెప్పారు. అందుకే మళ్లీ రెడ్ల రాజ్యం రావాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఈ వ్యాఖ్యలు వాట్సాప్ లో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

మరోవైపు వైసీపీ అభ్యర్థిని గెలిపించుకోవాలంటూ మోదుగుల చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడ్దారు. పార్టీలో సభ్యత్వం కూడా లేని మోదుగులకు లోక్ సభ టికెట్ ఇచ్చి, గెలిపించిన సంగతి గుర్తుంచుకోవాలని అన్నారు. 2014లో గుంటూరు పశ్చిమ టికెట్ కోసం ఎందరో ప్రయత్నించినా... మోదుగులకే చంద్రబాబు టికెట్ ఇచ్చారని చెప్పారు. ఇంత చేసినా టీడీపీలో తనకు అన్యాయం జరుగుతోందని ఆయన చెప్పడం సరైంది కాదని మండిపడ్డారు. 

More Telugu News