Prakasam District: ఇంటర్ విద్యార్థినికి మద్యం అలవాటు చేసిన మాజీ సైనికుడు... ప్రకాశం జిల్లాలో ఘోరం!

  • ప్రైవేటు కాలేజీలో చదువుతున్న 17 ఏళ్ల బాలిక
  • పుట్టిన రోజు పార్టీకి పిలిచి సామూహిక అత్యాచారం
  • బాలిక మానసిక స్థితి చూసి మరికొందరు కూడా
  • నిందితుల్లో సహచర విద్యార్థి కూడా!
  • పోలీసుల అదుపులో కొందరు నిందితులు

ఇంటర్ చదువుతున్న ఓ బాలిక (17)కు మద్యం అలవాటు చేసి, ఆమెను మభ్యపెట్టిన మాజీ సైనికోద్యోగి, మరో ఎనిమిది మందితో కలిసి సామూహిక అత్యాచారం చేయగా, ఆమె మానసిక స్థితిని పసిగట్టిన మరికొందరు దారుణానికి ఒడిగట్టిన ఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరులో వెలుగులోకి వచ్చింది.

పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, పట్టణంలో నివసించే ఓ కుటుంబానికి చెందిన బాలిక, ప్రైవేటు కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. ఆమెపై కన్నేసిన మిలటరీ మాజీ ఉద్యోగి సురేంద్ర (45), బాలికకు మద్యం తాగడాన్ని అలవాటు చేశాడు. ఇటీవల ఓ రోజు తన పుట్టిన రోజు పార్టీకి రావాలని ఆమెను ఆహ్వానించి, ఆమెను మద్యం మత్తులో ముంచి, మరో ఎనిమిది మందితో కలిసి దారుణానికి పాల్పడ్డాడు.

నాటి నుంచి ఆమె ముభావంగా ఉంటూ, ఎవరితోనూ మాట్లాడకుండా ఉండగా, అదే అదనుగా మరికొందరు అత్యాచారానికి పాల్పడ్డారు. బిడ్డ మానసిక స్థితిని చూసిన తల్లిదండ్రులు గట్టిగా ప్రశ్నించడంతో విషయం బయటకు వచ్చింది. దీంతో వారు నిన్న సీఐ శ్రీరాంను కలిసి ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుల్లో కొందరిని అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు. బాలికపై అత్యాచారం జరిగినట్టు ప్రాథమిక వైద్య విచారణలో తేలడంతో మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఆమె చదివే కాలేజీ విద్యార్థి కూడా ఒకరు ఉన్నట్లు తెలుస్తోంది.

More Telugu News