Balakrishna: సామాజిక న్యాయమే తెలుగుదేశం పార్టీ ఎజెండా: ఎన్నికల ప్రచారంలో బాలకృష్ణ

  • తెలుగుజాతి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు ఎన్టీఆర్‌
  • ఈ గుండె ఆగినా, ఆడినా ఆ పార్టీ కోసమే
  • అమర వీరుల కుటుంబాలను పట్టించుకోని టీఆర్‌ఎస్‌

సామాజిక న్యాయం అజెండాగా పేదల అభ్యున్నతి కోసం ఉద్భవించిన పార్టీ తెలుగుదేశం అని, నిరుపేదలకు ఏదో చేయాలన్న తపనతో నాడు ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపించారని సినీనటుడు, హిందూపురం శాసన సభ్యుడు బాలకృష్ణ అన్నారు. తెలుగుజాతి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు ఎన్టీఆర్‌ అన్నారు. ఈ గుండె ఆగినా, ఆడినా అటువంటి పార్టీ కోసం పనిచేస్తుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బాలకృష్ణ శేరిలింగంపల్లి నియోజక వర్గంలోని వివేకానందనగర్‌లో జరిగిన ఎన్నికల సభలో ఉద్వేగంగా ప్రసంగించారు.

తెలుగుదేశం జెండాయే అభివృద్ధికి చిహ్నమని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధన కోసం ఎంతోమంది బలిదానం చేశారని, అమరవీరుల కుటుంబాలను గుర్తించడంలో కేసీఆర్‌ ప్రభుత్వం పూర్తిగా విఫమయిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఆత్మహత్యలు పెరిగిపోయాయన్నారు. గడీల రాజ్యాన్ని అంతం చేసింది టీడీపీనే అని గుర్తు చేశారు. తెలంగాణ అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర విస్మరించలేనిదన్నారు.

దేశాన్ని కాపాడడం కోసమే చంద్రబాబు కూటమి ఏర్పాటు చేస్తున్నారని, ఆయన ఢిల్లీ పాలకుల కాళ్లు మొక్కే రకం కాదన్నారు. చంద్రబాబు ప్రతిష్టను ఎవరూ మసకబార్చలేరన్నారు.

More Telugu News