Nalgonda District: బాలికపై తండ్రీ కొడుకుల అత్యాచారం... బాధితురాలి ఆత్మహత్య!

  • నల్గొండ జిల్లా నాంపల్లిలో ఘటన
  • ఒకరికి తెలియకుండా మరొకరు అత్యాచారం 
  • పురుగుల మందు తాగి బాధితురాలి ఆత్మహత్య

తన కుమార్తె వయసున్న బాలికపై, కామాంధుడైన ఓ తండ్రి అత్యాచారానికి పాల్పడుతుంటే, అతనికి తెలియకుండా, అతని కుమారుడు కూడా అదే పని చేశాడు. పదహారేళ్ల బాలికపై ఒకరికి ఒకరు తెలియకుండా అత్యాచారం చేస్తూ, తమ పశువాంఛను తీర్చుకున్న వారి క్రూరత్వానికి నిండు ప్రాణం బలైంది.

పోలీసులు వెల్లడించిన మరింత సమాచారం ప్రకారం, నల్గొండ జిల్లా నాంపల్లి మండలం, తిరుమలగిరిలో కూలి పనులకు వెళ్లి పొట్టపోసుకునే కుటుంబం బాధితురాలిది. అదే గ్రామంలో ఉండే బూతం శ్రీను, అతని కుమారుడైన తొమ్మిదో తరగతి విద్యార్థి, ఆ బాలికపై నిత్యమూ అత్యాచారం చేసేవారు. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం బాలిక కడుపునొప్పితో తల్లడిల్లగా, కుటుంబ సభ్యులు దేవరకొండ ఆసుపత్రికి తీసుకెళ్లారు.

అక్కడ ఆమె గర్భవతని తేలడంతో, బాధిత కుటుంబీకులు శ్రీనును నిలదీశారు. దీంతో అబార్షన్ చేయించుకోవాలన్న సలహా ఇచ్చాడతను. గర్భానికి, తమకు సంబంధం లేదని దాడికి దిగారు. తనకు న్యాయం జరగదన్న మనోవేదనతో ఆ బాలిక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఇంత దారుణం చేసిన వారిద్దరినీ కఠినంగా శిక్షించాలంటూ, మృతురాలి బంధువులు ధర్నాకు దిగారు. నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.

More Telugu News