Ravela Kishore Babu: చంద్రబాబు పదవి ఇచ్చారు... అధికారాలు అట్టేపెట్టుకున్నారు!: రావెల కిశోర్‌బాబు

  • ఆత్మాభిమానాన్ని చంపుకోలేకే బయటకు వచ్చేశాను
  • అయితే మంత్రిని చేసినందుకు టీడీపీ అధినేతకు కృతజ్ఞతలు
  • రావెల వచ్చే ఏడాది మంత్రి అవుతారని ప్రకటించిన పవన్‌కల్యాణ్‌

టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు క్యాబినెట్‌లో నాకు చోటు కల్పించి మంత్రిని చేసినా అధికారాలు మాత్రం తనవద్దే అట్టేపెట్టుకున్నారని మాజీ మంత్రి రావెల్‌ కిశోర్‌బాబు వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన కిశోర్‌బాబు శనివారం జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో ఆ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.

విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో భార్యతోపాటు వెళ్లి జనసేన కండువా కప్పుకున్న కిశోర్‌బాబు అనంతరం విలేకరులతో మాట్లాడారు. పదవి ఉండీ ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఆత్మాభిమానం చంపుకోలేకపోయానన్నారు. చివరికి పార్టీని వీడాల్సి వచ్చిందని చెప్పారు. అయితే తనపై నమ్మకం ఉంచి మంత్రి పదవి ఇచ్చిన చంద్రబాబునాయుడుకు కృతజ్ఞతలు తెలియజేయడం విశేషం. కాగా, వచ్చే ఏడాది రావెల కిశోర్‌బాబు ఎమ్మెల్యే కాదు, మంత్రి కూడా కానున్నారని పవన్‌ కల్యాణ్‌ ప్రకటించడం గమనార్హం.

More Telugu News