siddu: ఆయన వెళ్లమంటేనే నేను పాకిస్థాన్ కు వెళ్లా: సిద్ధూ

  • మా కెప్టెన్ రాహుల్ చెబితేనే పాకిస్థాన్ వెళ్లాను
  • 20 మంది సీనియర్ నేతలతో కలసి వెళ్లాలని రాహుల్ ఆదేశించారు
  • రాహుల్ ఎక్కడకు వెళ్లమని చెబితే... నేను అక్కడకు వెళతాను

భారత్ నుంచి వచ్చే సిక్కు యాత్రికుల కోసం పాకిస్థాన్ నిర్మిస్తున్న కర్తార్ పూర్ కారిడార్ శంకుస్థాపన కార్యక్రమానికి మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి సిద్ధూ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఖలిస్థాన్ వేర్పాటువాద నేత గోపాల్ సింగ్ చావ్లాతో ఫొటో దిగడం పెద్ద వివాదానికి దారి తీసింది. సిద్ధూపై బీజేపీ, అకాలీదళ్ నేతలు విమర్శలను ఎక్కుపెట్టారు. సిద్ధూ పాకిస్థాన్ ఏజెంట్ అంటూ విమర్శిస్తున్నారు. అంతేకాదు, దీనిపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ స్పందించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ అంశంపై సిద్ధూ స్పందించారు. తన కెప్టెన్ రాహుల్ గాంధీ అని, ఆయన తనను ఎక్కడకు వెళ్లమని ఆదేశిస్తే అక్కడకు వెళతానని చెప్పారు. 20 మంది సీనియర్ నేతలతో కలసి అక్కడకు వెళ్లాలని రాహుల్ తనకు సూచించారని తెలిపారు. మా కెప్టెన్ ఆదేశాల మేరకే తాను పాకిస్థాన్ వెళ్లానని చెప్పారు. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కు కూడా రాహులే కెప్టెన్ అని... అమరీందర్ కేవలం ఆర్మీ కెప్టెన్ మాత్రమేనని అన్నారు. 

More Telugu News