nandamuri: తెలంగాణ ఎన్నికలు.. నందమూరి సుహాసినికి మద్దతుగా కల్యాణ్ రామ్ భార్య ప్రచారం!

  • కూకట్ పల్లిలో ప్రచారం నిర్వహించిన స్వాతి
  • వదినను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి
  • ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తానన్న సుహాసిని

ఈసారి తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమిని గెలిపించాలని కూకట్ పల్లి టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసిని ప్రజలకు పిలుపునిచ్చారు. నందమూరి కుటుంబం తరఫున ప్రజలకు సేవ చేసేందుకు తాను ముందుకొచ్చాననీ, తనను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. కేపీహెచ్‌బీ డివిజన్‌ వసంతనగర్‌ నుంచి కేపీహెచ్‌బీ నాలుగోఫేజ్‌ వరకూ ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల్లో కూకట్ పల్లి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని ప్రజలందరికీ తాను అండగా ఉంటానని ధీమా వ్యక్తం చేశారు.

తాతయ్య నందమూరి తారకరామారావు, నాన్న హరికృష్ణ, మామయ్య చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తూ ప్రజా సేవకు అంకితమవుతానని నందమూరి సుహాసిని పేర్కొన్నారు. కాగా, ఈ సందర్భంగా సుహాసినికి మద్దతుగా సినీనటుడు నందమూరి కల్యాణ్‌రామ్‌ సతీమణి స్వాతి ప్రచారం చేశారు. నందమూరి కుటుంబం నుంచి వచ్చిన మా వదిన సుహాసినిని అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

మరోవైపు శ్రీ శక్తి మహిళా మండలి ఆధ్వర్యంలో కేపీహెచ్‌బీ మూడో ఫేజ్‌లోని కనకదుర్గమ్మ ఆలయంలో సుహాసిని గెలవాలంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళా మండలి చైర్మన్ రాధికారెడ్డి ఆధ్వర్యంలో సుహాసినిని సన్మానించారు. ఈ సందర్భంగా సుమారు 300మంది టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు టీడీపీలో చేరారు.

More Telugu News