Bengalore: బెంగళూరులో మొదలై చెన్నైలో ముగిసిన వివాహిత ప్రేమకథ... చివరికి ప్రియుడి మైండ్ బ్లాంక్!

  • బెంగళూరులో పని చేస్తున్న చెన్నై యువకుడు
  • వివాహితని తెలియకుండా స్నేహం, ప్రేమ
  • పెళ్లయిన విషయాన్ని దాచిపెట్టిన యువతి
  • యువకుడిపై కిడ్నాప్ కేసు

బెంగళూరులో మొదలై, చెన్నైలో ముగిసిన ఓ వివాహిత ప్రేమకథ ఇది. పెళ్లయి బిడ్డకు తల్లిగా ఉన్న యువతిని తాను ప్రేమించానన్న విషయం ఆఖరి క్షణంలో మాత్రమే ఆ ప్రియుడికి తెలియడం కొనమెరుపు. పోలీసులు వెల్లడించిన మరింత సమాచారం ప్రకారం, చెన్నైకి చెందిన మహమ్మద్ బిలాల్ (21) బెంగళూరులోని ఓ క్లాత్ షోరూములో పనిచేస్తుండగా, అక్కడికి తరచూ షాపింగ్ నిమిత్తం వచ్చే తలాసుం (19) అనే యువతి పరిచయమైంది.

వీరి పరిచయం స్నేహంగా, ఆపై ప్రేమగా మారగా, బెంగళూరులో కలిసుంటే పెద్దలు అడ్డు పడతారన్న ఆలోచనలో, ఇద్దరూ కలసి గత బుధవారం రాత్రి చెన్నైకి చెక్కేశారు. ఆపై చెన్నైలో పెద్ద హైడ్రామాయే నడిచింది. యువతి తల్లిదండ్రులు బెంగళూరు పోలీసులను ఆశ్రయించగా, సెల్ ఫోన్ సిగ్నల్స్ ను ట్రాక్ చేసిన పోలీసులు వారు చెన్నైలో ఉన్నారని తేల్చారు.

దీంతో చెన్నైకి చేరుకున్న యువతి తల్లిదండ్రులు ప్రేమజంటను కలిసి బిలాల్ పై దాడికి దిగారు. బిలాల్ కూడా తామిద్దరం ప్రేమించుకున్నామని, పెళ్లి చేసుకుంటే తప్పేంటని ప్రశ్నించాడు. పెళ్లయిన అమ్మాయితో పెళ్లేంటని ప్రశ్నించగా కంగుతిన్నాడు. ఇదే విషయాన్ని తలాసుంను అడిగి ఖరారు చేసుకున్నాడు. ఆమె తనకు బిడ్డ కూడా ఉందని చెప్పడంతో బిలాల్ మైండ్ బ్లాంక్ అయింది. ఆపై పోలీసులు బిలాల్ ను అరెస్ట్ చేసి బెంగళూరుకు తీసుకెళ్లి, కిడ్నాప్ కేసు పెట్టారు.

More Telugu News