Chandramukhi: ఎవరో చేతబడి చేసి తీసుకెళ్లారు: మీడియాతో చంద్రముఖి సంచలన వ్యాఖ్యలు

  • తెలియని స్థితిలో చెన్నైకి వెళ్లాను
  • ఎన్నికల్లో నిలబడినప్పటి నుంచి బెదిరింపులు
  • చంద్రముఖి చెబుతున్న విషయాలను నమ్మని పోలీసులు

కొందరు వ్యక్తులు తనకు చేతబడి చేసి కిడ్నాప్ చేశారని గోషామహల్ తరఫున బీఎల్ఎఫ్ అభ్యర్థిగా బరిలోకి దిగి, ఆపై రెండు రోజులు అదృశ్యమై తిరిగొచ్చిన హిజ్రా చంద్రముఖి సంచలన వ్యాఖ్యలు చేశారు. బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో మీడియాతో మాట్లాడిన ఆమె, తాను మంగళవారం ఉదయం 8 గంటలకు రూ. 25 వేలు బ్యాంకులో జమ చేసేందుకు వెళ్లానని, ఓ ఆటో ఎక్కగా, ఆటోవాలా తనను కోఠిలోని ఓ ప్రాంతానికి తీసుకెళ్లాడని, అక్కడ మరో ఆటో ఎక్కి ఎల్బీనగర్‌ లో దిగానని చెప్పింది.

ఎవరో చేతబడి చేసినట్టుగా తనను మత్తు ఆవరించిందని, ఎటు వెళుతున్నానో తెలియకుండానే, ఎల్బీ నగర్ నుంచి విజయవాడకు, అక్కడి నుంచి తిరుపతి, ఆపై చెన్నైకి వెళ్లానని చెప్పారు. కోఠిలో ఇద్దరు తనను బెదిరించారని, వారిని మరోసారి చూస్తే గుర్తు పడతానని అన్నారు.

తాను ఎన్నికల్లో నిలబడినప్పటి నుంచి బెదిరింపులు వస్తూనే ఉన్నాయని, తన అజ్ఞాతం వెనుక చేతబడి, రాజకీయ కారణాలు ఉన్నాయని తెలిపారు. కాగా, ఆమె చెబుతున్న పొంతన లేని విషయాలను నమ్మని పోలీసులు, అదృశ్యానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నట్టు వెల్లడించారు.

More Telugu News