kcr: గెలవాల్సింది రాజకీయ పార్టీలు కాదు.. ప్రజలు: సీఎం కేసీఆర్

  • ఈ ఎన్నికల్లో పెద్ద కన్ఫ్యూజన్ ఏమీ లేదు
  • గొప్పలు చెప్పే ‘కాంగ్రెస్’ నిరంతర విద్యుత్ ఇవ్వలేదే?
  • హైదరాబాద్ ను చంద్రబాబే కట్టారట!

'గెలవాల్సింది రాజకీయ పార్టీలు, అభ్యర్థులు కాదని ప్రజలు' అని సీఎం కేసీఆర్ అన్నారు. మందమర్రిలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో పెద్ద కన్ఫ్యూజన్ ఏమీ లేదని, అంతా స్పష్టంగా ఉందని అన్నారు. ఎన్నికల సమయంలో ఎప్పుడూ కూడా కన్ఫ్యూజన్ తో ఓటు వేయొద్దని, ఆలోచించి ఓటు వేయాలని సూచించారు.

ఈ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం సాధించిన టీఆర్ఎస్ పార్టీ ఒకవైపు, ఎన్నో ఏళ్లు పాలించిన కాంగ్రెస్, టీడీపీలు మరోవైపు ఉన్నాయని, ప్రజలు పరిణతితో ఆలోచించి ఓట్లు వేయాలని కోరారు. తెలంగాణను నాడు పాలించిన పార్టీల హయాంలో విద్యుత్ సరఫరా ఎలా ఉందో, నేడు టీఆర్ఎస్ హయాంలో ఎలా ఉందో ఆలోచన చేయాలని సూచించారు. రైతులు, పట్టణ ప్రజలు సంతోషంగా ఉన్నారని, పరిశ్రమలు బాగా నడుస్తున్నాయని, కార్మికులకు మూడు షిఫ్ట్ లు పని చేసుకునే అవకాశం లభిస్తోందని.. కడుపు నిండుతోందని అన్నారు.

ఎన్నో గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ నాడు తెలంగాణలో నిరంతర విద్యుత్ సరఫరా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఇక, చంద్రబాబు అయితే, హైదరాబాద్ ను తానే కట్టానని అంటారని, మరి, కులీకుతుబ్ షా ఆత్మహత్య చేసుకోవాలా? అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చార్మినార్ కూడా చంద్రబాబే కట్టాడా? అని ప్రశ్నించారు. హైదరాబాద్ ను ప్రపంచపటంలో పెట్టింది తానేనని చెబుతున్న చంద్రబాబు, నాడు తెలంగాణలో నిరంతర విద్యుత్ సరఫరా ఎందుకు చేయలేదు? అని దుయ్యబట్టారు.

More Telugu News