Chandrababu: ఇవన్నీ మా గురించి టీఆర్ఎస్ నేతలే చెప్పారు: చంద్రబాబు

  • ఏపీకి ప్రత్యేక హోదాను సమర్థిస్తున్నామని పార్లమెంటులో టీఆర్ఎస్ చెప్పింది
  • తెలంగాణ సంపదను పెంచింది నేనే అని కేసీఆర్ చెప్పారు
  • ఐటీ రంగంలో హైదరాబాదుకు గుర్తింపు తెచ్చింది నేనే అని కేటీఆర్ చెప్పారు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రకరకాలుగా మాట్లాడారని సనత్ నగర్ రోడ్ షోలో చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే అంశంపై పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీయాలంటూ తమ పార్టీ ఎంపీలకు చెబుతున్నానంటూ  2018 మార్చిలో కేసీఆర్ చెప్పారని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ ను టీఆర్ఎస్ సమర్థిస్తోందని, విభజన సమయంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిందేనని టీఆర్ఎస్ ఎంపీ కవిత చెప్పారని గుర్తు చేశారు.

తెలంగాణలో సంపదను పెంచింది చంద్రబాబేనని కేసీఆర్ చెప్పారని అన్నారు. ఐటీ రంగంలో ప్రపంచ పటంలో హైదరాబాదుకు గుర్తింపు తెచ్చింది చంద్రబాబేనని మంత్రి కేటీఆర్ చెప్పారని తెలిపారు. మైక్రోసాఫ్ట్ ఇక్కడకు రావడానికి కారణం చంద్రబాబేనని, ఆ గొప్పదనాన్ని తమ అకౌంట్ లో వేసుకోలేమని కేటీఆర్ చెప్పారని అన్నారు. ఇంతకు ముందు ఇన్ని చెప్పిన టీఆర్ఎస్ నేతలు... ఇప్పుడు తననెందుకు విమర్శిస్తున్నారని ప్రశ్నించారు. హైదరాబాద్ సనత్ నగర్ లో నిర్వహించిన సభలో ప్రసంగిస్తూ చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.

More Telugu News