illegal contact: ఏపీలో దారుణం.. తన కుమార్తెతో సహజీవనం వద్దన్నందుకు.. కాల్చి చంపేశాడు!

  • పశ్చిమగోదావరి జిల్లా వై.రామవరం మండలంలో దారుణం
  • ఆదిరెడ్డి కుమార్తెతో సహజీవనం చేస్తున్న దొరబాబు
  • నిందితుడి వద్ద నుంచి నాటు తుపాకి, 11 బుల్లెట్లు స్వాధీనం

తన కూతురుతో సహజీవనం వద్దని వారించిన వ్యక్తిని దారుణంగా కాల్చి చంపిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా వై.రామవరం మండలం రేగడిపాలెంలో చోటు చేసుకుంది. నరాకోట ఆదిరెడ్డి (50) అనే గిరిజనుడిని అదే మండలానికి చెందిన దూసరపాము గ్రామానికి చెందిన గంగాధరరావు అలియాస్ దొరబాబు నాటు తుపాకితో కాల్చి చంపాడు. దొరబాబుకు పెళ్లై భార్య ఉంది. అయినా, ఆదిరెడ్డి రెండో కుమార్తెతో కొంత కాలం నుంచి సహజీవనం చేస్తున్నాడు.

ఈ నేపథ్యంలో, తన కుమార్తెతో సహజీవనం వద్దని దొరబాబును ఆదిరెడ్డి వారించాడు. దీంతో, కోపోద్రిక్తుడైన దొరబాబు నాటు తుపాకితో అతన్ని అంతమొందించాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై హత్యా నేరం, నాటు తుపాకిని కలిగి ఉండటం, అట్రాసిటీ కేసులను నమోదు చేశారు. అతని వద్ద నుంచి నాటు తుపాకి, 11 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.

More Telugu News