Telangana: సోదాలకు వచ్చిన పోలీసులు.. ఒంటిపై పెట్రోలు పోసుకున్న కేసీఆర్ ప్రత్యర్థి వంటేరు ప్రతాప్‌రెడ్డి

  • వంటేరు ఇంటిలో సోదాలు
  • భారీగా చేరుకున్న అనుచరులు, కార్యకర్తలు
  • పోలీసుల తీరుకు నిరసన

కాంగ్రెస్ నేత, గజ్వేల్‌లో కేసీఆర్ ప్రత్యర్థి అయిన వంటేరు ప్రతాప్‌రెడ్డి ఇంటి వద్ద సోమవారం అర్ధ రాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. ఆసుపత్రి నుంచి వచ్చి రోజైనా గడవకముందే సోదాల పేరుతో పోలీసులు ఆయన ఇంటికి వచ్చారు. వంటేరును బయటకు రాకుండా నిర్బంధించి సోదాలకు యత్నించారు. పోలీసుల తీరుకు నిరసనగా ప్రతాప్‌రెడ్డి ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారు. పోలీసులు తనను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

విషయం తెలిసిన అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వంటేరు ఇంటికి చేరుకున్నారు. దీంతో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నివాసాలను సోదా చేయడం తమ విధి అని పోలీసులు వారికి నచ్చజెప్పారు. అనంతరం సోదాలు చేసి నగదు లభించకపోవడంతో వెనుదిరిగారు. బయటకు వచ్చిన పోలీసులను కార్యకర్తలు చుట్టుముట్టి అడ్డుకున్నారు. ఫిర్యాదు ఎవరు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.

More Telugu News