kcr: నేను కేసీఆర్ లా బ్రోకర్ బతుకు బతికి రాజకీయాల్లోకి రాలేదు: ఉత్తమ్ ఎద్దేవా

  • అన్ని పార్టీల నేతలను కొనుక్కున్న నీచ చరిత్ర కేసీఆర్ ది
  • సోనియా వల్లే తెలంగాణ వచ్చిందని కేసీఆర్ చెప్పారు
  • తెలంగాణలో ఏ అభివృద్ధిని చంద్రబాబు అడ్డుకున్నారో కేసీఆర్ చెప్పాలి

ప్రధాని మోదీని చూస్తేనే ముఖ్యమంత్రి కేసీఆర్ లాగు తడుస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. మోదీకి భయపడి ఆయనతో కేసీఆర్ లాలూచీ పడ్డారని అన్నారు. తెలంగాణ ఇవ్వడాన్ని పార్లమెంటులో మోదీ పార్లమెంటులో తప్పుబట్టారని అన్నారు. అన్ని పార్టీల నేతలను కొనుక్కున్న నీచ చరిత్ర కేసీఆర్ ది అని చెప్పారు. టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో సామాన్యులు బతకలేరని అన్నారు. ప్రాజెక్టులలో తీసుకున్న కమిషన్ ను... ఇప్పుడు కేసీఆర్ పంచుతున్నారని మండిపడ్డారు. సోనియాగాంధీ వద్దనుకుని ఉంటే తెలంగాణ వచ్చేది కాదని చెప్పారు. సోనియా వల్లే తెలంగాణ వచ్చిందని కేసీఆర్ కూడా చెప్పారని తెలిపారు.

తెలంగాణలో ఏ అభివృద్ధిని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అడ్డుకున్నారో కేసీఆర్ చెప్పాలని ఉత్తమ్ డిమాండ్ చెప్పారు. జనాలను తప్పుదోవ పట్టించేందుకు కేసీఆర్ పిట్ట కథలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ కూడా సక్రమంగా ఇవ్వలేదని మండిపడ్డారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి, తానే గద్దెనెక్కాడని విమర్శించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా దళితుడిని చేయవద్దని చంద్రబాబు అడ్డుపడ్డారా? అని ఎద్దేవా చేశారు. యావత్ భారతదేశంలో కేసీఆర్ కు మించిన అబద్ధాలకోరు లేరని అన్నారు. ఓటమి భయంతోనే మహాకూటమిపై కేసీఆర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. దేశంలోనే అత్యంత అవినీతి రాష్ట్రంగా తెలంగాణను నిలిపారని మండిపడ్డారు. ప్రభుత్వం కంటే ప్రతిపక్షమే మంచి పాత్ర పోషించిందని చెప్పారు. కేసీఆర్ లా బ్రోకర్ బతుకు బతికి తాము రాజకీయాల్లోకి రాలేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

More Telugu News