pattipati pullarao: మీ విమర్శల బాణాలు కేంద్రంపై ఎక్కుపెట్టండి: వైసీపీ, జనసేనలకు మంత్రి ప్రత్తిపాటి హితవు

  • రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కేంద్రం తీరు మీకు కనిపించడం లేదా?
  • తిత్లీ తుపాన్‌ నష్టం ఎంతో, కేంద్రం ఎంతిచ్చిందో మీకు తెలియదా?
  • మోదీని పల్లెత్తు మాట అనని మీ తీరు ప్రజలు గమనిస్తున్నారు

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రతి అభివృద్ధి పనికి అడ్డుపుల్లలు వేస్తూ, నిధులివ్వకుండా మోకాలడ్డుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని పల్లెత్తుమాట అనని వైసీపీ, జనసేన పార్టీలు తెలుగుదేశం పార్టీని విమర్శించడం విడ్డూరంగా ఉందని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం ఆగర్రు గ్రామంలో జరిగిన గ్రామదర్శిని కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు.

తిత్లీ తుపాన్‌ బీభత్సంతో శ్రీకాకుళం జిల్లాకు జరిగిన నష్టం ఏమిటో అందరికీ తెలుసునన్నారు. ఎంత నష్టం జరిగిందో, కేంద్రం ఎంతిచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదన్నారు. ఇటువంటి అంశాలపై వైసీపీ, జనసేన నేతలు కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని, నిధులివ్వాలని అడగరేమని ప్రశ్నించారు. ఎంపీ పదవులకు రాజీనామా చేసి వైసీపీ నేతలు ఏం సాధించారో చెప్పాలని కోరారు.

రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న మోదీని పల్లెత్తు మాట అనని వైసీపీ నేతల అసలు ఉద్దేశం ఏమిటో ప్రజలకు చెప్పక్కర్లేదన్నారు. రాష్ట్రంలో కుటుంబాల కంటే రేషన్‌ కార్డులు అధికంగా ఉన్నప్పటికీ ఇంకా కార్డులు లేనివారున్నారని, అర్హులందరికీ త్వరలో రేషన్‌ కార్డులు అందజేస్తామని తెలిపారు.

More Telugu News