Andhra Pradesh: కిరాయి హంతకులతో తన మర్డర్ కు కుట్ర పన్నినట్లు జగన్ ఆరోపించడం సిగ్గుచేటు!: సోమిరెడ్డి

  • నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వైసీపీ విఫలమయింది
  • ఏపీ ప్రజలు చంద్రబాబు వైపే ఉన్నారు
  • తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో పర్యటించిన మంత్రి

ఆంధ్రప్రదేశ్ లో అర్హత ఉన్న ప్రతీ రైతుకు పార్టీలకు అతీతంగా రుణమాఫీ చేశామని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కేవలం రైతుల పంటలకు మద్దతు ధర ప్రకటించి చేతులు దులుపుకుంటోందని సోమిరెడ్డి విమర్శించారు. రైతన్నలకు కావాల్సిన ఎరువులు, నాణ్యమైన విత్తనాలు, గిడ్డంగులు సహా ఇతర ఏ అంశాలను కేంద్రం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.

రాష్ట్రంలో నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించడంలో వైసీపీ ఘోరంగా విఫలమయిందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కిరాయి హంతకులతో తనను హత్య చేయించేందుకు కుట్ర పన్నినట్లు వైసీపీ అధినేత జగన్ ఆరోపించడం సిగ్గుచేటన్నారు. ఏడాదిపాటు ప్రజల్లో తిరిగినా ఎలాంటి ఆదరణ లేకపోవడంతో జగన్ కోడికత్తి డ్రామాకు తెరతీశారని ఆరోపించారు. వైసీపీ, బీజేపీ ఎన్నికుట్రలు చేసినా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ ప్రజలు చంద్రబాబుకే మరోసారి పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలోనూ బీజేపీయేతర ఫ్రంట్ కు చంద్రబాబు శ్రీకారం చుట్టారని వ్యాఖ్యానించారు.

More Telugu News