Congress: డబుల్ బెడ్‌రూం ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కాంగ్రెస్ బంపర్ హామీ!

  • ‘వన్ టైం రెంట్ రీయింబర్స్‌మెంట్’ కింద రూ. 50 వేలు
  • ఏడాదిలోనే లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు
  • కేసీఆర్‌ను బొందపెట్టే సమయం ఆసన్నమైంది

తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ మరో వరం ప్రకటించింది. మహాకూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రవ్యాప్తంగా డబుల్ బెడ్‌రూం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఇంటి అద్దెల నుంచి ఊరట కలిగిస్తామని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ‘వన్ టైం రెంట్ రీయింబర్స్‌మెంట్’ రూ.50 వేలు ఇస్తామని, ప్రజా కూటమి అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లోనే ఆ మొత్తాన్ని అందిస్తామన్నారు. అలాగే, దరఖాస్తుదారులకు ఏడాదిలోనే డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టించి ఇస్తామన్నారు. ఈ పథకానికి ‘మా ఇంటి వెలుగు’ అని పేరు పెడతామన్నారు.

 కేసీఆర్ కుటుంబం మినహా మిగతా టీఆర్ఎస్ నేతలంతా కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఒకటి రెండు రోజుల్లోనే ఎవరూ ఊహించని విధంగా కాంగ్రెస్‌లో చేరికలు ఉంటాయన్నారు. కేసీఆర్ తెలంగాణ ముసుగు వెనక ఉన్న అధికార, ధన దాహం ఇన్నాళ్లకు బయటపడిందని, కేసీఆర్ నియంతృత్వం నుంచి విముక్తి పొందేందుకు ఇదే సరైన సమయమని అన్నారు. మోసగాడైన కేసీఆర్‌ను బొందపెట్టే సమయం ఆసన్నమైందని ఉత్తమ్ కుమార్ అన్నారు.

More Telugu News