KCR: కేసీఆర్ ప్రత్యర్థి వంటేరు మాటలకు బోరున విలపించిన గ్రామ మహిళలు!

  • గజ్వేల్ లో కేసీఆర్ ప్రత్యర్థిగా వంటేరు ప్రతాప్ రెడ్డి
  • సొంతూరులో ప్రచారం
  • ఓడిపోతే కనిపించనని చెప్పడంతో మహిళల కన్నీరు

తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యర్థిగా, గజ్వేల్ లో మహాకూటమి తరఫున బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డి, తన సొంతూరులో ప్రచారం చేస్తున్న వేళ, ఆయన మాట్లాడిన మాటలు విన్న మహిళలు వెక్కి వెక్కి ఏడ్చారు. బూర్గుపల్లికి వెళ్లిన ఆయన, తాను పదిహేనేళ్లుగా ప్రజల మధ్య ఉన్నానని, ఏ కష్టం వచ్చినా ఆదుకున్నానని గుర్తు చేశారు. గ్రామ ప్రజలందరినీ తన కుటుంబంతో సమానంగా చూసుకున్నానని, రెండుసార్లు ఓడినా ప్రజలను వీడలేదని చెప్పారు.

తీవ్ర భావోద్వేగంతో మాట్లాడిన ఆయన, ఊరిలో ఉన్న తన పెంకుటిల్లు కూలిపోతే, పట్నంలో కిరాయికి ఉంటున్నానని చెప్పారు. గజ్వేల్ లో ఇల్లు కట్టుకునేందుకు ప్రభుత్వం సహకరించలేదని అన్నారు. ఈ దఫా ఓడిపోతే ఇంక మీకెవరికీ కనిపించనని ఆయన అనడంతో, అక్కడే ఉన్న పలువురు మహిళలు కంటతడి పెట్టారు. ఆపై వంటేరు ఏడుస్తున్న మహిళల వద్దకు వెళ్లి వారిని ఓదార్చి కన్నీరు తుడిచారు.

More Telugu News