Himachal Pradesh: చేయని తప్పుకు జైల్లో ఉంటూ సివిల్స్... అసలైన 'స్టూడెంట్ నంబర్ 1'

  • హిమాచల్ ప్రదేశ్ లో వాస్తవ గాథ 
  • అత్యాచారం కేసులో విక్రమ్ కు జైలు శిక్ష
  • న్యాయం కోసం పోరాడుతూ సివిల్స్ కు ప్రిపరేషన్
  • నిర్దోషిగా తేల్చిన హైకోర్టు

జూనియర్ ఎన్టీఆర్ నటించిన తొలి చిత్రం 'స్టూడెంట్ నంబర్ 1' గుర్తుందా? చేయని తప్పుకు జైల్లో శిక్షను అనుభవిస్తూ, తన తండ్రి కోరిక మేరకు న్యాయవాద వృత్తిని అభ్యసిస్తాడు హీరో. అచ్చం అటువంటి ఘటనే సిమ్లాలో జరుగగా, ఆ వాస్తవ గాథ ఇప్పుడు వైరల్ అవుతోంది.

మరిన్ని వివరాల్లోకి వెళితే, విక్రమ్ సింగ్ (27) సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్న వేళ, ఓ అత్యాచారం కేసులో ఇరుక్కున్నాడు. సెషన్స్ కోర్టు అతనికి జైలు శిక్ష విధించింది. ఈ కేసులో తాను నిర్దోషినని అతను వాదించినా ఫలితం లేకపోయింది. దీంతో హిమాచల్ ప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించి, జైల్లోనే ఉంటూ సివిల్స్ పరీక్షకు ప్రిపేర్ అయ్యాడు. తాజాగా హైకోర్టు అతన్ని నిర్దోషిగా తేల్చింది. ఇక తన టార్గెట్ సివిల్స్ రాసి, ప్రజలకు సేవ చేయడమేనని అంటున్నాడు విక్రమ్.

జైలు జీవితం గురించి మాట్లాడుతూ, చేయని తప్పుకు రెండేళ్లు జైల్లో ఉన్నానని, తాను ఎలాంటి తప్పూ చేయలేదని తన అంతరాత్మకు తెలుసునని అన్నాడు. సెషన్స్ కోర్టు శిక్ష విధించినప్పుడు తాను ఆందోళన చెందలేదని, భారత న్యాయ వ్యవస్థపై ఉన్న నమ్మకంతోనే హైకోర్టును ఆశ్రయించి విజయం సాధించానని చెప్పాడు.

లక్ష్యాన్ని సాధించడం కోసం జైల్లోనూ కష్టపడి చదువుతూ వచ్చినట్టు చెప్పాడు. తనవంటి నిరుద్యోగులకు ఉపయుక్తకరంగా ఉండేందుకు 'కాంపిటీషన్ కంపేనియన్' అనే పుస్తకాన్ని రాశానని అన్నాడు. తనకు జైలు అధికారులు ఎంతో సహకరించారని, సివిల్స్ ప్రిపరేషన్ కు ఏర్పాట్లు చేశారని అన్నారు. పుస్తకం రాస్తానని చెబితే, సహాయపడ్డారని తెలిపారు.

More Telugu News