"నా మాట నిలబెట్టండి" అని కేటీఆర్ కోరినా వినని కొండా!

  • నాన్న బహిష్కరిస్తానన్నారు
  • నేనే ఆపాను, టీఆర్ఎస్ లో ఉండిపొండి
  • కొండాకు ఫోన్ చేసి చెప్పిన కేటీఆర్
  • బహిష్కరిస్తే బహిష్కరించుకోవాలని అన్న కొండా
"నాన్న (కేసీఆర్) మిమ్మల్ని టీఆర్ఎస్ నుంచి బహిష్కరించాలని అంటున్నారు. నేనే ఆపాను. మీరు టీఆర్ఎస్ లోనే కొనసాగి నా మాట నిలబెట్టండి"... నిన్న ఉదయం చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వరరెడ్డికి ఫోన్ చేసి కేటీఆర్ చెప్పిన మాట ఇది. అప్పటికే పార్టీని వీడాలని నిర్ణయించుకున్న ఆయన, "పార్టీ నుంచి బహిష్కరిస్తే బహిష్కరించుకోండి" అని గట్టిగానే సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది.

 ఆ వెంటనే టీఆర్ఎస్ కు షాకిస్తూ, ఆ పార్టీకి రాజీనామా చేసిన ఆయన, ఎంపీగానూ రిజైన్ చేయనున్నట్టు ప్రకటించి, ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. నేడు ఆయన లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కు రాజీనామా లేఖను ఇవ్వనుండగా, దాన్ని వెంటనే ఆమోదిస్తారని సమాచారం. ఆపై మీడియాతో మాట్లాడేందుకు కొండా విశ్వేశ్వర్ రెడ్డి నిర్ణయించుకోవడంతో, ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారోనన్న ఆసక్తి నెలకొంది. ఇప్పటికే పలువురు ఏఐసీసీ నేతలతో చర్చలు జరిపిన ఆయన రేపు లేదా ఎల్లుండి సోనియాగాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు.
Go Back to Shorts
Konda Vishweshwar Reddy
KTR
KCR
Resign

More Telugu News