mamata banerjee: స్టాలిన్ తో కలిసి సాంబారు ఇడ్లీ తింటారు..మమతా బెనర్జీకి శాలువాలు కప్పుతారు: చంద్రబాబుపై జగన్ విమర్శలు

  • ఈ దేశాన్ని ఏలేద్దామని వారితో బాబు చెబుతుంటారు
  • చంద్రబాబుకు రాష్ట్ర సమస్యలు పట్టట్లేదు
  • జాతీయ సమస్యలపై పోరాడతారట!

డీఎంకే అధినేత స్టాలిన్ తో కలిసి సాంబారు ఇడ్లీ తింటారని, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిని కలిసి శాలువాలు కప్పుతారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై వైసీపీ అధినేత జగన్ విమర్శలు గుప్పించారు. విజయనగరం జిల్లాలోని కురుపాంలో జరుగుతున్న బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ఇద్దరం కలిసి ఈ దేశాన్ని ఏలేద్దామని వారితో చంద్రబాబు చెబుతుంటారని విమర్శించారు.

అన్యాయం, అవినీతి పాలన చేస్తున్న చంద్రబాబుకు రాష్ట్ర సమస్యలు పట్టట్లేదని, జాతీయ సమస్యలపై పోరాడతానంటున్నారని విమర్శించారు. అవసరమైతే, అంతరిక్ష సమస్యలను పరిష్కరిస్తానంటారని చంద్రబాబుపై సెటైర్లు విసిరారు. నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే కురుపాం అభివృద్ధి చెందిందని, చంద్రబాబు పాలనలో అభివృద్ధి కానరావట్లేదని విమర్శించారు.

 ఏపీలో గుడి భూములు, బడి భూములూ దోచేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు పాలనలో ఊరికి కనీసం నాలుగైదు ఇళ్లు కూడా ఇవ్వడం లేదని, ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేదని, పంట మొత్తం దళారుల పాలయ్యాక, కొనుగోలు కేంద్రాలను తెరుస్తున్నారని, అప్పుడు కొనుగోలు కేంద్రాలు తెరిస్తే, ఎవరికి లాభం? అని ప్రశ్నించారు. దళారులను చంద్రబాబే ప్రోత్సహిస్తున్నారని, రైతుల నుంచి తక్కువ రేట్లకు కొనుగోలు చేసి, హెరిటేజ్ లో నాలుగు, ఐదు రెట్లకు ఎక్కువగా అమ్ముతున్నారని ఆరోపించారు.

సంతలో పశువులను కొన్న మాదిరిగా తమ ఎమ్మెల్యేలను చంద్రబాబు కొన్నారని, కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణిని ప్రలోభపెట్టని రోజు లేదని విమర్శించారు. ఎన్ని ప్రలోభాలు వచ్చినా విలువలతో కూడిన రాజకీయాలు చేశారని పుష్పశ్రీవాణిపై ఆయన ప్రశంసలు కురిపించారు.

More Telugu News