Congress: కాంగ్రెస్ లో టికెట్ల లొల్లి.. తుంగతుర్తి పార్టీ ఆఫీసులో విధ్వంసం సృష్టించిన వడ్డేపల్లి వర్గీయులు!

  • అద్దంకి దయాకర్ కు టికెట్ ఇవ్వడంపై ఆగ్రహం
  • ప్లెక్సీల చించివేత, కుర్చీల ధ్వంసం
  • టికెట్ ఇవ్వకుంటే స్వతంత్రంగా పోటీచేస్తామని స్పష్టీకరణ

తెలంగాణ ఎన్నికల వేళ సూర్యాపేటలోని తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రణరంగంగా మారింది. తుంగతుర్తి టికెట్ ను పార్టీ అధిష్ఠానం అద్దంకి దయాకర్ కు కేటాయించడంతో వడ్డేపల్లి రవి వర్గీయులు రెచ్చిపోయారు. చేతికి అందిన వస్తువులను అందినట్లు నేలకేసి కొట్టారు. పార్టీ ఆఫీసులో ప్లెక్సీలను చించివేశారు. అనంతరం ఆఫీసుకు తాళం వేయడంతో పాటు రోడ్డుపై అద్దంకి దయాకర్ దిష్టి బొమ్మను దహనం చేశారు.

ఈ సందర్భంగా రవి వర్గీయులు మాట్లాడుతూ.. గత రెండేళ్లుగా కాంగ్రెస్ పార్టీని వడ్డేపల్లి రవి పటిష్టంగా తీర్చిదిద్దారని తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకు రవి అండగా ఉన్నారనీ, ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే స్పందించారని వెల్లడించారు.

అలాంటి వ్యక్తిని కాదని మధ్యలో వచ్చిన దయాకర్ కు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం టికెట్ కేటాయించడం దారుణమన్నారు. ఇప్పటికైనా తమ నాయకుడికి తుంగతుర్తి టికెట్ ను కేటాయించాలని కాంగ్రెస్ హైకమాండ్ కు విజ్ఞప్తి చేశారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకుంటే వడ్డేపల్లి రవిని స్వతంత్ర అభ్యర్థిగా భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని స్పష్టం చేశారు.

More Telugu News