bandaru datta treya: ప్రాజెక్టుల పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం దోపిడీ చేస్తోంది: బండారు దత్తాత్రేయ

  • టీఆర్ఎస్ సెంటిమెంట్ రాజకీయాలు చేస్తోంది
  • అమలుకు సాధ్యం కాని హామీలు ఇస్తోంది
  • ఎన్నికల ప్రచారానికి మోదీ, అమిత్ షా వస్తారు

టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడానికి సెంటిమెంట్ రాజకీయాలు చేస్తోందని, అమలుకు సాధ్యం కాని హామీలు ఇస్తోందని బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ఆరోపించారు. టీ-బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రాజెక్టుల పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం దోపిడీ చేస్తోందని మండిపడ్డారు. దేవాలయాల అభివృద్ధిలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు.

ఈ సందర్భంగా తమ ఎన్నికల ప్రచారం గురించి దత్తాత్రేయ మాట్లాడుతూ, తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సహా పార్టీకి చెందిన నలభై మంది అగ్రనేతలు పాల్గొననున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, తెలంగాణ జన సమితి పార్టీలపై ఆయన విమర్శలు చేశారు. యువత ప్రాణాలను బలిగొన్న కాంగ్రెస్ పార్టీతో టీజేఎస్ పొత్తు పెట్టుకుందని మండిపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబుపైనా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీబీఐ పేరు వినగానే చంద్రబాబుకు జ్వరం వస్తోందని, చంద్రబాబు ఓ నియంతలా వ్యవహరిస్తున్నారని దత్తాత్రేయ విమర్శించారు.

More Telugu News