Maharashtra: రెస్టారెంట్ పెట్టేందుకు బాలిక కిడ్నాప్.. చిన్నతప్పుతో పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన దుండగులు!

  • మహారాష్ట్రలోని పూణెలో ఘటన
  • నగదు కోసం బాలిక కిడ్నాప్ కు యత్నం
  • నిందితులు రిమాండ్ కు తరలింపు

సాధారణంగా వ్యాపారం కోసం బంధువులు, లేదా తెలిసినవాళ్ల దగ్గర కొందరు అప్పు చేస్తారు. మరికొందరేమో బ్యాంకు నుంచి లోన్లు తీసుకుంటారు. కానీ మహారాష్ట్రలో మాత్రం ఇద్దరు ప్రబుద్ధులు మాత్రం రెస్టారెంట్ పెట్టేందుకు కొత్తదారి కనిబెట్టారు. ఓ బాలికను కిడ్నాప్ చేసి ఆమె కుటుంబ సభ్యుల నుంచి డబ్బును గుంజాలని వేసిన ప్లాన్ బెడిసికొట్టింది. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణెలో చోటుచేసుకుంది.

పూణెలోని మాహీ జైన్(12) అనే బాలిక పెన్ను కొనేందుకు సమీపంలోని షాపుకు వెళ్లింది. ఇంతలోనే అటుగా వచ్చిన ఓ కారులో ఇద్దరు దుండగులు ఆమెను బలవంతంగా ఎక్కించుకుని పరారయ్యారు. దీంతో షాపు యజమాని, కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అన్ని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేసి గాలింపును ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో అమ్మాయి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసిన నిందితులు రూ.50 లక్షలు తీసుకురావాలని డిమాండ్ చేశారు.

ఈ నేపథ్యంలో సెల్ ఫోన్ తో కాల్ చేయడం అధికారులకు వరంలా మారింది. వెంటనే సిగ్నల్ ట్రేస్ చేసిన పోలీసులు.. నిందితులంతా పూణేలోని ఓ ఫ్లాట్ లో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే దాడిచేసి బాలికను కాపాడారు. ఈ సందర్భంగా ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. బాలిక సురక్షితంగా బయటపడటంతో ఆమె కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

More Telugu News