Uttar Pradesh: అధికార దర్పం.. సిబ్బంది చేత చెప్పులు తుడిపించుకున్న మంత్రి!

  • ఉత్తరప్రదేశ్ లోని కుషినగర్ లో ఘటన
  • మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి
  • వివరణ ఇచ్చిన మంత్రి రాజేంద్ర సింగ్

ఉత్తరప్రదేశ్ లో ఓ మంత్రి తన అధికార దర్పాన్ని ప్రదర్శించారు. ప్రభుత్వ కార్యక్రమానికి హాజరై తిరిగివెళుతూ తన సిబ్బంది చేత చెప్పులు తుడిపించుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మంత్రి ఉక్కిరిబిక్కిరి అయ్యారు. తన చెప్పులను ఎవ్వరూ తుడవలేదనీ, తానే శుభ్రం చేసుకున్నానని వివరణ ఇచ్చారు.

యూపీ మంత్రి రాజేంద్ర ప్రతాప్ సింగ్ కుషినగర్ లోని ఓ కాలేజీలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం తిరిగివెళుతుండగా ఆయన చెప్పులపై పడ్డ మట్టి, నీళ్లను సిబ్బంది ఎరుపురంగు టవల్ తో శుభ్రం చేశారు. దీన్ని మీడియా ప్రసారం చేయడంతో ఒక్కసారిగా దుమారం చెలరేగింది. ఓ మంత్రి అయ్యుండి సిబ్బందితో ఇలా ప్రవర్తిస్తారా? అంటూ నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

దీంతో రాజేంద్ర ప్రతాప్ సింగ్ నష్టనివారణ చర్యలకు దిగారు. తాను చెప్పులను శుభ్రం చేయాల్సిందిగా సిబ్బందికి చెప్పలేదని స్పష్టం చేశారు. నీళ్లు, మట్టి పడటంతో తన చెప్పులను తానే క్లీన్ చేసుకున్నానని వివరణ ఇచ్చారు.

More Telugu News