East Godavari District: రామచంద్రాపురం రైల్వే స్టేషన్ లో దారుణం... ఉద్యోగిని దుస్తులు మార్చుకుంటుంటే వీడియో తీసిన సూపరింటెండెంట్!

  • తూర్పుగోదావరి జిల్లాలో ఘటన
  • కీచకుడిగా మారిన సూపరింటెండెంట్ రియాజ్
  • రహస్య వీడియో చిత్రీకరణను నిన్న కనిపెట్టిన ఉద్యోగిని

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం రైల్వే స్టేషన్ లో కీచకుడిగా మారిన ఓ సూపరింటెండెంట్ ఇప్పుడు ఉద్యోగానికి దూరమయ్యాడు. మహిళా ఉద్యోగిని దుస్తులు మార్చుకుంటుంటే, వీడియో తీస్తూ, వాటిని ల్యాప్ టాప్ లో దాస్తూ పట్టుబడ్డాడీ దుర్మార్గుడు. మరిన్ని వివరాల్లోకి వెళితే, స్టేషన్ లో మహ్మద్ రియాజ్ సూపరింటెండెంట్, కాగా, అదే స్టేషన్ లో ఓ వివాహిత, గేట్ కీపర్ గా పని చేస్తోంది. ఇటీవల స్టేషన్ లో ఉన్న రిజర్వేషన్ కౌంటర్ తొలగించడంతో, ఆ మహిళ, గదిలో తన దుస్తులు మార్చుకుని యూనిఫాం వేసుకునేది. ఈ విషయాన్ని గమనించిన రియాజ్, ఆ గదిలో ఓ సీక్రెట్ కెమెరాను పెట్టాడు. ఆమె గదిలోకి వెళ్లినప్పుడల్లా, వీడియో రికార్డు చేసి దాచసాగాడు.

నిన్న ఆ మహిళ బట్టలు మార్చుకునేందుకు వెళ్లిన వేళ, చిన్న ఎల్ఈడీ బల్బు వెలగడంతో అనుమానం వచ్చిన ఆమె, అసలు విషయాన్ని గుర్తించింది. ఈ విషయంలో ఆమె పై అధికారులను ఆశ్రయించగా, పోలీసులు రంగంలోకి దిగి, రియాజ్, రహస్యంగా వీడియో తీశాడని నిర్ధారించారు. దీంతో డీఆర్ఎం ఆదేశాలతో అతన్ని సస్పెండ్ చేశారు అధికారులు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

More Telugu News