Andhra Pradesh: సముద్రాలను కంట్రోల్ చేశాడు.. రెయిన్ గన్లతో సీమలో కరవును తరిమేశాడు!: సీఎం చంద్రబాబుపై విజయసాయి రెడ్డి సెటైర్లు

  • ఏపీలో ఇప్పుడు ఒక్క దోమా కనిపించడం లేదు
  • పనిముట్లతో పేదరికాన్ని పారదోలాడు
  • చంద్రబాబు పై ఫేస్ బుక్ లో వైసీపీ ఎంపీ విమర్శలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై వైసీపీ నేత, పార్లమెంటు సభ్యుడు విజయసాయి రెడ్డి విమర్శల వర్షం కురిపించారు. సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు, చేపట్టిన పథకాలపై ఈ రోజు ఫేస్ బుక్ లో విజయసాయి రెడ్డి స్పందిస్తూ.. రెయిన్ గన్లను పట్టుకుని చంద్రబాబు రాయలసీమలో కరవును కంటికి కనిపించకుండా చేశారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

చంద్రబాబు చేపట్టిన ‘దోమలపై దండయాత్ర’ తర్వాత ఏపీలో ఒక్క దోమ కూడా కనిపించడం లేదని సెటైర్ వేశారు. టెక్నాలజీతో ఏకంగా సముద్రాలను కంట్రోల్ చేసేశారని దెప్పిపొడిచారు. ఆదరణ పనిముట్లతో పేదరికాన్ని తరిమికొట్టిన చంద్రబాబు పేపర్లకు ఎక్కారని వెటకారమాడారు.

 ‘రెయిన్ గన్ పట్టుకుని సీమలో కరువు కంటికి కనిపించకుండా తరిమికొట్టాడు. దండయాత్రతో దోమలపై సంహారం చేసి దోమ కనిపించకుండా చేశాడు. టెక్నాలజీతో సముద్రాలను కంట్రోల్ చేశాడు. తుపాన్లను ఒంటి చేత్తో ఆపేశాడు. ఆదరణ పనిముట్లతో పేదరికాన్ని తరిమికొట్టి పేపర్లకు ఎక్కాడు నాయుడుబాబు’ అని ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.

More Telugu News