Telangana: ప్రజల కోరిక మేరకే పోటీ చేస్తున్నా.. 17న ఆలేరులో నామినేషన్ వేస్తా: మోత్కుపల్లి

  • ఆలేరుకు గోదావరి జలాలను తీసుకొస్తా
  • నియోజకవర్గంలో పర్యటించిన నేత
  • నామినేషన్ కు తరలిరావాలని పిలుపు

ఆలేరు నియోజకవర్గ ప్రజల కోరిక మేరకే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని గోదావరి జల సాధన సమితి చీఫ్, టీడీపీ మాజీ నేత మోత్కుపల్లి నర్సింహులు ప్రకటించారు. తాను ఏ ఊరికి వెళ్లినా ప్రజలు ఘనంగా స్వాగతం పలుకుతున్నారనీ, ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని తిరుమలాపూర్, గంధమల్ల, వీరారెడ్డిపల్లి, ఇబ్రహీంపూర్, దత్తాయపల్లి గ్రామాల్లో పర్యటించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

తాను ఇప్పటివరకూ 8 మండలాల్లోని 200 గ్రామాల్లో పర్యటించానని మోత్కుపల్లి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఉందన్నారు. ఆలేరు నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశానని వెల్లడించారు. మరోసారి అవకాశం ఇస్తే గోదావరి జలాలను తీసుకొచ్చి ప్రజల కాళ్లు కడుగుతానని వ్యాఖ్యానించారు.

భూకబ్జాదారులు, దందాలు నిర్వహించే వారు ఎమ్మెల్యేలుగా ఎన్నికై ఈ ప్రాంత అభివృద్ధిని విస్మరించారన్నారు. ఈ నెల 17న తాను నామినేషన్ దాఖలు చేస్తున్నాననీ, ఈ కార్యక్రమానికి భారీగా తరలిరావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

More Telugu News