Chittoor District: తిరుపతిలో దారుణం.. హాస్టల్‌లో బాలికపై నాలుగేళ్లుగా అత్యాచారం

  • షెల్టర్ హోం బాలికపై అకృత్యం
  • బెదిరించి లోబరుచుకున్న హాస్టల్ సూపరింటెండెంట్
  • బాలిక ఫిర్యాదుతో కేసు నమోదు

తిరుపతిలో గత నాలుగేళ్లుగా ప్రభుత్వ బాలికల వసతి గృహంలో ఓ బాలికపై జరుగుతున్న దారుణం ఆలస్యంగా వెలుగు చూసింది. హాస్టల్ సూరింటెండెంటే ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎట్టకేలకు బాలిక ఫిర్యాదు చేయడంతో సూపరింటెండెంట్ దారుణం బయటపడింది.  పోలీసుల కథనం ప్రకారం..  కడప జిల్లాకు చెందిన బాలిక 2012లో ఉన్నత విద్య కోసం తిరుపతిలోని షెల్టర్ హోంలో చేరింది. ఆమె తల్లి చనిపోగా, ఓ కేసులో తండ్రి జీవిత శిక్ష అనుభవిస్తున్నాడు. దీంతో ఆమెను వసతి గృహానికి తరలించారు.

షెల్టర్ హోం సూపరింటెండెంట్ అయిన బత్యాల నందగోపాల్ కన్ను బాలికపై పడింది. చిన్నారిని చిత్ర హింసలకు గురిచేయడమే కాకుండా, రాత్రుళ్లు తన గదికి పిలిపించుకుని అత్యాచారానికి పాల్పడేవాడు. బాలిక నిరాకరిస్తే చంపేస్తానని బెదిరించేవాడు. ఈ ఏడాది అక్టోబరు 27న బాలికను కడప వసతి గృహానికి అధికారులు బదిలీ చేశారు. దీంతో ఊపిరి పీల్చుకున్న బాధిత చిన్నారి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్‌పర్సన్‌ శివకామినిని కలిసి నందగోపాల్ అకృత్యాలను బయటపెట్టింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను కడపలోని రిమ్స్‌కు తరలించారు. వైద్యుల నుంచి నివేదిక వచ్చిన అనంతరం నిందితుడిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

More Telugu News