Vijayawada: విజయవాడలో నేటి నుంచి రెండు రోజులపాటు సోషల్‌ మీడియా సమ్మిట్‌.. సెలబ్రిటీల హాజరు!

  • హాజరుకానున్న కరీనాకపూర్‌, ఖుష్బూ, వీవీఎస్‌ లక్ష్మణ్‌, దేవిశ్రీప్రసాద్‌, సమంత
  • యూట్యూబ్‌లో వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన వారికి అవార్డు ప్రదానోత్సవం
  • రెండో రోజు కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు

ప్రస్తుతం సమాచార రంగాన్ని శాసిస్తున్న సోషల్‌ మీడియా (సామాజిక మాధ్యమాల) సమ్మిట్‌కు విజయవాడ నగరం వేదికవుతోంది. ఈరోజు నుంచి రెండు రోజులపాటు జరగనున్న ఈ వేడుకకు కరీనాకపూర్‌, ఖుష్బూ, వీవీఎస్‌ లక్ష్మణ్‌, దేవిశ్రీప్రసాద్‌, సమంత, స్వరాభాస్కర్‌, ప్రణీత వంటి సినీ, క్రికెట్‌ ప్రముఖులు హాజరవుతున్నారు.

నగరంలోని ఏ ప్లస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ (తొలిరోజు), ఇందిరా గాంధీ క్రీడా మైదానం (రెండోరోజు)లో వేడుకలు నిర్వహిస్తున్నారు. రెండో రోజు యూట్యూబ్‌లో ఆయా రంగాల్లో ప్రతిభ చూపిన వారికి అవార్డులు అందజేయనున్నారు. సమాజం, సామాజిక మాధ్యమాల ప్రభావంపై ఆయా రంగాల్లో ప్రముఖులు మాట్లాడుతారు. తొలిరోజు 15 మంది ప్రముఖులు పాల్గొని ఆయా రంగాల్లో సామాజిక మాధ్యమాల ప్రభావంపై ప్రసంగిస్తారు. రెండో రోజు సాయంత్రం ఇందిరాగాంధీ స్టేడియంలో సాయంత్రం 6 గంటలకు అవార్డు ప్రదానోత్సవం జరగనుంది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సామాజిక మాధ్యమాల్లో ప్రతిభ చూపుతున్న 40 మందికి అవార్డులు అందిస్తారు. బాలీవుడ్‌ నటి కరీనాకపూర్‌తో పాటు సమంత, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌లు సెలబ్రిటీ విభాగంలో అవార్డు అందుకోనున్నారు.

More Telugu News