Andhra Pradesh: జగన్ విచారణకు సహకరించడం లేదు.. హైకోర్టుకు తెలిపిన అటార్నీ జనరల్ శ్రీనివాస్!

  • జగన్ పిటిషన్ ను పరిశీలించిన హైకోర్టు
  • ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం
  • తదుపరి విచారణ రేపటికి వాయిదా

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై జరిగిన హత్యాయత్నం కేసును ఉమ్మడి హైకోర్టు ఈ రోజు విచారించింది. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వ సంస్థలతో విచారణ జరపాలంటూ జగన్ దాఖలు చేసిన పిటిషన్ కు విచారణ అర్హత ఉందా? లేదా? అన్న విషయాన్ని రేపు నిర్ణయిస్తామని వెల్లడించింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను తమముందు ఉంచాలని ఏపీ అడ్వొకేట్ జనరల్ ను ఆదేశించింది.

ఈ సందర్భంగా జగన్ తరఫు న్యాయవాది వాదిస్తూ.. కేసును తప్పుదోవ పట్టించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు, డీజీపీ ఆర్పీ ఠాకూర్ వ్యవహరించారని ఆరోపించారు. అయితే ఆ ఆరోపణలను ఖండించిన ఏజీ దమ్మలపాటి శ్రీనివాస్.. పోలీసుల విచారణకు జగన్ సహకరించడం లేదని తెలిపారు. పోలీసులకు సహకరించాల్సిందిగా పిటిషనర్ ను ఆదేశించాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

అక్టోబర్ 25న విశాఖపట్నం నుంచి హైదరాబాద్ కు వస్తున్న జగన్ పై శ్రీనివాసరావు అనే యువకుడు కోడి కత్తితో దాడిచేసిన సంగతి తెలిసిందే. ప్రథమ చికిత్స అనంతరం విశాఖపట్నం ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరిన జగన్ హైదరాబాద్ లో ఆపరేషన్ చేయించుకున్నారు. ఈ దాడి ఘటనతో విజయనగరం జిల్లాలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్ర వాయిదా పడింది.

More Telugu News