Kerala: మరో ప్రణయ్, అమృత... కేరళలో పెళ్లయిన రెండు రోజులకే హత్య... కోర్టుకు కేసు!

  • కొట్టాయంలో లవ్ చేసుకున్న నీనూ జోసెఫ్
  • ఆపై రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న ప్రేమజంట
  • రెండోరోజే కిడ్నాప్ చేసి హత్య చేయించిన కుటుంబీకులు
  • ఆరు నెలల్లో విచారణ పూర్తి చేయాలన్న కోర్టు

దాదాపు ఆరు నెలల క్రితం కేరళలో జరిగిన ఓ పరువు హత్య కేసుకు సంబంధించిన విచారణ కోర్టులో ప్రారంభమైంది. తమ కుమార్తెను తీసుకెళ్లి లవ్ మ్యారేజ్ చేసుకున్నాడన్న కారణంతో, పెళ్లయిన రెండు రోజులకే ఓ యువకుడిని యువతి కుటుంబీకులు హత్య చేయించగా, ఈ కేసు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య కేసుకు, ఈ కేసుకు చాలా పోలికలు ఉన్నాయి.

ఈ ఘటన పూర్వాపరాలను పరిశీలిస్తే, కేరళలోని కొట్టాయం ప్రాంతానికి చెందిన నీనూ (21), జోసెఫ్ (23) రెండేళ్ల పాటు ప్రేమించుకున్నారు. బైక్ మెకానిక్‌ గా పనిచేసే జోసప్, నీనూను తీసుకెళ్లి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. దీంతో ఆగ్రహానికి లోనైన యువతి కుటుంబం జోసెఫ్‌ ను, పెళ్లయిన రెండోరోజే, కిడ్నాప్ చేయించింది. ఆ మరుసటి రోజే, అతని మృతదేహం చాలియెక్కర కెనాల్‌ లో కనిపించగా, వివిధ సంఘాలు నిరసనలకు దిగాయి.

కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు, నిందితులను అరెస్ట్ చేయగా, కొట్టాయం అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టులో వాదనలు జరిగాయి. ఈ ఉదంతాన్ని పరువు హత్య‌గా తేల్చిన కోర్టు, మొత్తం విచారణను ఆరు నెలల్లో పూర్తి చేయాలని నిర్ణయించడం గమనార్హం.

More Telugu News