Chandrababu: డిసెంబర్ 11 తర్వాత రాహుల్, చంద్రబాబులు వీణ, ఫిడేల్ వాయించుకోవాల్సిందే: కేటీఆర్ సెటైర్లు

  • సామాన్యులు టీఆర్ఎస్ పక్షాన ఉన్నారు
  • చంద్రబాబు పుల్లలు పెడుతున్నారు
  • కాంగ్రెసోళ్లకు కడుపు మంట ఎక్కువ

జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డిని ఓడించి అద్భుతమైన తీర్పు ఇవ్వాలని మంత్రి కేటీఆర్ పిలుపు నిచ్చారు. జగిత్యాలకు చెందిన వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, జగిత్యాలకు జీవన్ రెడ్డి, టీ-టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ చేసింది శూన్యమని
విమర్శించారు.

తెలంగాణలో సామాన్యులు టీఆర్ఎస్ పక్షాన ఉన్నారని, త్వరలో జరగబోయే ఎన్నికల్లో తమ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై నిప్పులు చెరిగారు. టీడీపీకి బద్ధవిరోధి అయిన కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని, చంద్రబాబు మరోసారి ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అమరావతిలో ఉంటూ చంద్రబాబు పుల్లలు పెడుతున్నారని, తెలంగాణలో ప్రాజెక్టులు ఆపాలంటూ కేంద్రానికి ముప్పై లేఖలు రాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెసోళ్లకు కడుపు మంట ఎక్కువ అని, తెలంగాణలో వాళ్లు చేయని అభివృద్ధిని సీఎం కేసీఆర్ చేస్తుంటే ఓర్వలేకపోతున్నారని అన్నారు. డిసెంబర్ 11 తర్వాత రాహుల్, చంద్రబాబులు వీణ, ఫిడేల్ వాయించుకోవాల్సిందేనని తెలంగాణ మంత్రి కేటీఆర్ సెటైర్లు విసిరారు.

More Telugu News